
హైటెక్ సిటీలో హస్తకళల ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో హస్తకళలకు ప్రత్యేక వేదిక కల్పించేలా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అమల అక్కినేని, దివ్య దేవరాజన్, టెక్స్టైల్ నిపుణురాలు, సీసీటీ వ్యవస్థాపక సభ్యురాలు విజయలక్ష్మి నార్నే, వ్యవసాయ శాస్త్రవేత్త, సీఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.వి. రామంజనేయులు ప్రారంభించారు.
ఇండియా హ్యాండ్ మేడ్ కలెక్టివ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చేతివృత్తిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం, హస్తకళలకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల కళాకారుల ఉత్పత్తులకు నగర మార్కెట్లతో అనుసంధానం కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ హస్తకళల ప్రోత్సాహంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతకు ఇది దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేతివృత్తుల ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నగర ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హస్తకళలను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.
