
సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్
సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులకే సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఏకంగా పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్సైట్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో వారం రోజులుగా రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి నెలకొంది. వెబ్ సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్లు కూడా హ్యాక్కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు కమిషనరేట్ల ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయ
హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ తరువాత పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన కేటుగాళ్లు సైట్ లోని లింక్ లు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్ లకు రీ డైరెక్ట్ అవుతున్నాయి. , దీంతో ఐటీ విభాగం సర్వర్లు డౌన్ చేసి ఎన్ఐసీకి సమాచారం అందించారు . ఎన్ఐసీ బృందం హ్యాకింగ్ ముఠాలపై దృష్టి పెట్టి సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తు౦ది.
ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్కు గురైన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం సైబర్ భద్రతపై ఆందోళనలను పెంచుతోంది. గతంలో తెలంగాణకు చెందిన అనేక ప్రభుత్వ వెబ్సైట్లు, పోలీస్ యాప్లు కూడా హ్యాక్ అయ్యాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ బృందం ఈ వెబ్సైట్లలోని లోపాలను గుర్తించి సరిచేసే పనిలో ఉంది. వెబ్సైట్ల పునరుద్ధరణకు మరో 10 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఈ హ్యాకింగ్ కారణంగా పోలీస్ స్టేషన్ల వివరాలు, అధికారుల కాంటాక్ట్ నంబర్లు వంటి సమాచారాన్ని యాక్సెస్ చేయలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
ప్రస్తుతం వెబ్సైట్ల పునరుద్ధరణకు ఎన్ఐసీ పర్యవేక్షణలో ప్రతినిధులు పనిచేస్తున్నారు. వైబ్ సైట్ల హ్యాకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు రెండు కమిషనరేట్లలోని ఐటీ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వాటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. మళ్లీ హ్యాకింగ్ కాకుండా అధునాతన ఫైర్వాల్స్ను వినియోగించేందుకుఐటీ బృందం కసరత్తు చేస్తుంది. హ్యాకింగ్ ముఠాలపై దృష్టి పెట్టిన ఎన్ ఐసీ బృందం, సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ హ్యాకింగ్ సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది.
