Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
శ్రీవారి పాదాలను స్పర్శించనున్న కృష్ణమ్మ

శ్రీవారి పాదాలను స్పర్శించనున్న కృష్ణమ్మ

FL - SUNL
20 అక్టోబర్, 2025

కర్నూలు జిల్లా మల్యాల నుంచి కృష్ణా జలాలు 738 కిలోమీటర్లు ప్రయాణించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువకు మధ్యలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి పైపులైన్ ద్వారా తిరుమలకు కృష్ణమ్మ పరవళ్లు సాగనున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చంద్రగిరి నుంచి కల్యాణి డ్యాం నుంచి ఎత్తిపోతలు, పైప్ నిర్మాణంతో కృష్ణా జలాలు చేరనున్నాయి. ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం 126 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆదేశాలు జారీ చేసింది.

జలవనరుల శాఖపై ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జలవనరుల శాఖపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు _"తిరుపతి పారిశ్రామిక అవసరాలు, తిరుమలలో యాత్రికుల దాహం తీర్చడానికి కృష్ణా జలాలు తరలిస్తాం" _స్పష్టంగా ప్రకటించారు. అంతకుముందు జూలైలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నపుడు కూడా అదే మాట చెప్పారు. రెండు నెలల వ్యవధిలోనే ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిధులు కూడా విడుదల చేయడం ద్వారా మాట నిలుపుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.

తిరుమలకు కల్యాణి డ్యాం వరం..

శేషాచలం పర్వతసానువులకు దిగువన చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని కల్యాణి డ్యాం నుంచి ఇప్పటికే నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరుపతి తోపాటు తిరుమలలో యాత్రికుల నిత్యావసరాలకు నీటిని లిఫ్ట్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వసతి కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు ప్రారంభించడం గమనార్హం.

చంద్రగిరిలో వెయ్యి ఎకరాల సాగు

చిత్తూరు జిల్లా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో 126 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.

అడవిపల్లె రిజర్వాయరు నుంచి చంద్రగిరి మీదుగా కల్యాణం డ్యాం ద్వారా తిరుమల, తిరుపతికి తాగు నీరు అందించే పథకంలో ఎత్తిపోతలతో నిర్మించే పైప్ లైన్ నిర్మాణానికి టీడీపీ కూటమి ప్రభుత్వం 126 కోట్లు కేటాయిస్తూ, ఈ నెల 15న జీఓ ఆర్టీ నంబర్ 560 నంబర్ తో ఉత్తర్వులు జారీ చేసింది. "సంవత్సరం లోపల ఈ పథకం పూర్తి చేయడానికి వీలుగా ఆదేశాలు అందాయి. నిధులు కూడా విడుదల చేశారు" అని తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

తిరుమల కోసం మరో యజ్ణం

రాయలసీమకు వరప్రసాదిని అయిన హంద్రీనీవా కాలువకు మాజీ సీఎం ఎన్టీరామారావు కాలంలో పునాది వేస్తే, నాలుగు దశాబ్దాల తరువాత మళ్లీ టీడీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈ పథకాన్ని తిరుపతికి చేరవ చేయడానికి కూడా మార్గం సిద్ధం చేశారు. సీఎం నారా చంద్రబాబు ఆలోచనకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాచరణ పనిచేసింది.

కడపకు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవి.పల్లె మండలంలో ఉన్న అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చంద్రగిరి మీదుగా తిరుమలకు తాగునీటిని అందించే భృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.

పుంగనూరు బ్రాంచ్ నుంచి..

పుంగనూరు బ్రాంచ్ కాలువ నుంచి చంద్రగిరి మీదుగా కల్యాణిడ్యాం వరకు పైప్ లైన్ నిర్మాణంతో కృష్ణా జలాల తరలింపునకు కార్యక్రమం సిద్ధం చేశారు. దీనికి 126 కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టుకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగుగంగ సీఈ చంద్రశేఖర్ కూడా ఈ విషయం ధృవీకరించారు.

పైప్ లైన్ ఇలా...

పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చంద్రగిరి మీదుగా కల్యాణి డ్యాం వరకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మీదుగా భీమవరం చెరువు, మూలపల్లె చెరువు సమీపంలోని మరో మూడు చిన్న చెరువులకు ఎత్తిపోతల ద్వారా ఎత్తపోతల ద్వారా కృష్ణా జలాలు తరలిస్తారు. అక్కడి నుంచి కొండ్రెడ్డి కండ్రిగ, కణితి మడుగు, నాగపట్న వెంకటరాయుని చెరువులను కృష్ణా జలాలతో నింపడం ద్వారా ఈ ప్రాజెక్టుకు ఊరిపిపోయనున్నారు. ఆ తరువాత కల్యాణిడ్యాంకు జలాలు తరలిస్తారు.

తాగునీటి అవసరాల కోసం..

చంద్రగిరి మండలం పోలీస్ శిక్షణ కళాశాల వద్ద కల్యాణి డ్యాం 1975లో నిర్మించారు. శేషాచలం అటవీప్రాంతానికి దిగువన ఉన్న ఈ డ్యాంలోకి తిరుమల గిరుల తోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షం నీటితోనే నిండుతుంది. తిరుపతి, తిరుమలలో తాగునీటి అవసరాల కోసమే ఈ డ్యాం నిర్మించారు. 1999లో కల్యాణి డ్యాంకు తాగునీటిని తరలించడానికి రెండు చోట్ల పంప్ హౌస్ లు, నీటిశుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిని 1999లో టీడీపీ ప్రభుత్వంలోనే అందుబాటులోకి తీసుకుని వచ్చారు.

కృష్ణా జలాలు కల్యాణి డ్యాంలోకి తరలించడం ద్వారా వర్షాభావ పరిస్థితి ఏర్పడినా తిరుమలలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పం నెరవెరనున్నది. తిరుమలకు ప్రస్తుతం కల్యాణి డ్యాం నుంచే కాకుండా, తిరుమలగిరుల్లోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, కొండకోనల్లో ఏర్పాటు చేసిన కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టుల నుంచి నీటిని శుద్ధి చేసి, తిరుమలకు తరలిస్తున్నారు.

శ్రీవారి పాదాలను స్పర్శించనున్న కృష్ణమ్మ - Tholi Paluku