
వైద్య వృత్తికి న్యాయం చేయాలి.. పీహెచ్సీ వైద్యులకు మంత్రి సత్యకుమార్ హితవు
'హక్కుల సాధన కోసం ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. పేదలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందిస్తున్నామా? లేదా? అన్న దానిపై నిత్యం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. పవిత్రమైన వైద్య వృత్తికి న్యాయం చేయాలి' అని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు.
విజయవాడలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు వైద్యులందరూ కృషి చేయాలని కోరారు. గ్రామీణులకు చేరువలో ఉండే వైద్యులు నిర్దేశించిన వేళల్లో కూడా పీహెచ్సీల్లో లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ సాయంత్రంపూట వెళ్లి తనిఖీచేస్తే పీహెచ్సీకి తాళం వేసి ఉండడమేటని ప్రశ్నించారు. 24 గంటలపాటు పనిచేయాల్సిన పీహెచ్సీల్లో ఒకరూ కూడా లేకపోవడమేమిటన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయిందన్న అపవాదు రాకూడదని ఇటీవల జరిగిన ఓ సంఘటనను గుర్తుచేశారు. వైద్యులు మంచిచేస్తే వెంటనే గుర్తింపు రాదన్నారు. కానీ.. చిన్న తప్పుచేస్తే మాత్రం వేలెత్తి చూపిస్తారని, దీనిని అందరూ గమనించాలని కోరారు.
సేవా భావాన్ని కలిగి ఉండాలి
వైద్య వృత్తిని ఉద్యోగంగానే కాకుండా సేవాభావాన్ని, మానవతావాదంతో చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో, వైద్యాన్ని అందించడంలో కీలకమైన పీహెచ్సీ వైద్యులు క్యాన్సర్-04 స్క్రీనింగ్ బాగా జరిగేలా కృషి చేయాలని కోరారు. క్యాన్సర్ వ్యాధికారణంగా తాను తల్లి, సోదరిని కోల్పోయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సోదరి కోరిక మేరకు తాను వైద్యుడి కాలేకున్నా వారితో కలిసి పనిచేసే అవకాశం కలిగిందని భావోద్వేగంతో చెప్పారు. స్టెమీ విధానాన్ని పటిష్ఠంగా అమలుచేస్తున్నందున గుండెపోటుకు గురైన వారిలో 3 వేల మందికి పైగా ప్రాణాలను నిలబెట్టినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాలకు సానుకూలం
ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్-సర్వీసు కోటా కింద డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రస్తుత సీట్ల భర్తీ విధానం, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. టైంబౌండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ట్రైబల్ అలవెన్స్ మంజూరు గురించి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ వైద్యులకు వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ జబ్బులు ముదరకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పీహెచ్సీ వైద్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యుల సంఘం ముఖ్య ప్రతినిధులు రవీంద్రనాయక్, వినోద్, కిషోర్, రాహుల్ మాట్లాడుతూ పీహెచ్సీల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను తనిఖీలకు పంపించాలని, ఆర్ధిక పరమైన డిమాండ్లు పరిష్కరించాలని, నైట్షిఫ్టుల్లో ఉన్న వారికి భద్రత కల్పించాలని, వాచ్మెన్ను నియమించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో మంత్రి సత్యకుమార్ ఎంతో చొరవను చూపుతున్నారని అభినందిస్తూ ఆయనను సత్కరించారు.
