
విజయనగరంలో రూ.1,200 కోట్ల బెర్రీ అల్లాయిస్ ప్రాజెక్టుకు ఏపీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో రూ.1,200 కోట్ల పెట్టుబడితో సమగ్ర మాంగనీస్, ఉక్కు ముడి పదార్థాల తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు బెర్రీ అల్లాయిస్ లిమిటెడ్కు 93.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 813 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సిఫార్సుల మేరకు, ఈ భూమిని ఎకరాకు రూ. 77.2 లక్షల చొప్పున రాయితీ ధరపై ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 90 ఎకరాల పారిశ్రామిక ప్లాట్లతో పాటు, నిరంతరాయంగా ప్రాజెక్ట్ సైట్ నిర్మాణం కోసం అదనంగా ఆనుకుని ఉన్న 3.43 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన విడుదలైంది. భారతదేశం జాతీయ ఉక్కు విధానం కింద 2030 నాటికి ఉక్కు తయారీ సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకునే లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఉక్కు ఉత్పత్తి పెరుగుదలతో మాంగనీస్కు డిమాండ్ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉక్కుకు బలాన్ని, గట్టిదనాన్ని, మన్నికను పెంచడంలో మాంగనీస్ కీలక పాత్ర పోషిస్తుంది. నిర్మాణ రంగం, ఆటోమొబైల్ పరిశ్రమ, రైల్వే ట్రాక్లు, రక్షణ రంగ పరికరాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల తయారీలో మాంగనీస్ ఆధారిత ఫెర్రో అల్లాయిస్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. కాలుష్య ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమలో డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ (డీఆర్ఐ) విధానాల వినియోగం పెరుగుతున్నందున అధిక నాణ్యత గల మాంగనీస్ ముడి పదార్థాల అవసరం కూడా పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
దేశంలోని ప్రముఖ ఫెర్రో అల్లాయిస్ తయారీ సంస్థల్లో ఒకటైన బెర్రీ అల్లాయిస్ ప్రస్తుతం ఫెర్రో మాంగనీస్, సిలికో మాంగనీస్తో పాటు ఇతర ప్రత్యేక మిశ్రమాలను తయారు చేస్తోంది. సంస్థకు ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. విశాఖపట్నం పోర్టుకు సమీపంలో ఉండటం సంస్థకు అనుకూలంగా మారిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మాంగనీస్ ఇన్స్టిట్యూట్ (ఐఎంఎన్ఐ) సభ్యత్వం కూడా సంస్థకు ఉంది.
ప్రతిపాదిత ప్రాజెక్టులో మాంగనీస్ సింటర్ యూనిట్, డీఆర్ఐ ప్లాంట్, కార్బన్ పేస్ట్ ప్లాంట్, 115 మెగావాట్ల సామర్థ్యంతో క్యాప్టివ్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. వార్షికంగా 5 లక్షల టన్నుల మాంగనీస్ సింటర్, సుమారు 3.3 లక్షల టన్నుల డీఆర్ఐ, 60 వేల టన్నుల కార్బన్ పేస్ట్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సముదాయానికి ఉండనుంది.
ముడి ఖనిజాలను నేరుగా ఎగుమతి చేయకుండా వాటికి విలువ జోడించి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలక అడుగుగా ప్రభుత్వం అభివర్ణించింది. ఉత్తరాంధ్రలో సమృద్ధిగా ఉన్న మాంగనీస్ ఖనిజ వనరులను ఆధారంగా చేసుకుని తయారీ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించే రాష్ట్ర వ్యూహంలో భాగంగానే ఈ పెట్టుబడి వస్తోందని తెలిపింది. అలాగే బెర్రీ అల్లాయిస్ తో పాటు దాని సరఫరాదారుల వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లోనే నమోదు కావాలని ప్రభుత్వం సూచించింది. దీనివల్ల రాష్ట్రంలో విస్తృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ఏర్పడటంతో పాటు ప్రాజెక్టు ద్వారా వచ్చే జీఎస్టీఆదాయం రాష్ట్రానికే లభించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ను ఉక్కు, లోహాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా జరుగుతున్న పెట్టుబడుల పరంపరలో బెర్రీ అల్లాయిస్ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా ప్రతిపాదించిన రూ.1.3 లక్షల కోట్ల సమగ్ర ఉక్కు కర్మాగారం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఖనిజ వనరులు, లోతైన సముద్ర తీర రేవులు, మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఉక్కు విలువ శ్రేణిలో కీలక తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.
