
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం!
హైదరాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులు, స్టాకింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం సుమారు 9.30 గంటలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆయన సోదరుడు, స్నేహితులు అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయ్ కృష్ణ రెడ్డి ఏదైనా హానికరమైన పదార్థాన్ని సేవించి ఉండవచ్చనే అనుమానంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా కడుపు శుభ్రపరిచే (స్టమక్ వాష్) ప్రక్రియ చేపట్టామని, అయితే ఇప్పటివరకు ఎలాంటి అసాధారణ పదార్థం గుర్తించలేదని వెల్లడించారు. రక్తం, మూత్ర నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం లేకుండా స్థిరంగా ఉన్నారని, మొదట అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు మత్తు స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆయన పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత, అలాగే పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే అసలు పరిస్థితి స్పష్టమవుతుందని వివరించారు.
ట్రైనీ ఉదయ్ కృష్ణ రెడ్డి గది సమీపంలో ఒక మద్యం సీసా, ఒక శానిటైజర్ బాటిల్ లభించినట్లు ఆయన సోదరుడు చెప్పిన విషయాన్ని వైద్యులు మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన నిజంగా ఏ పదార్థం సేవించారనే అంశంపై పరీక్షల ఫలితాల అనంతరం మాత్రమే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సహచర ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి జూన్ 23 నుంచి ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసే సందేశాలు పంపుతున్నారని, అకాడమీ ప్రాంగణంలో తన స్నేహితుల సమక్షంలో అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, తనకు మరో ట్రైనీ అధికారితో అక్రమ సంబంధం ఉందంటూ అసత్య ప్రచారం చేశాడని, అలాంటి సంబంధాన్ని అంగీకరించాలని ఒత్తిడి తెచ్చి దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 9న తనను అడ్డగించి బలవంతంగా తన గదికి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని ఈడ్చాడని, గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని, కత్తిని మెడపై ఉంచి బయటకు వెళ్లనివ్వలేదని ఆరోపించారు. మరుసటి రోజు జూలై 10న మరోసారి తనపై శారీరక దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
అదేవిధంగా, తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియో చిత్రీకరించి, దానిని తన భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జూలై 18న అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని మహిళపై దాడి, లైంగిక వేధింపులు, మహిళ గౌరవాన్ని అవమానించే చర్యలు, స్టాకింగ్ తదితర నేరాలకు సంబంధించిన సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ట్రైనీ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టపరమైన ప్రక్రియలో నిజం వెలుగులోకి వస్తుందని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ట్రైనీ అధికారికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదైన అనంతరం ఆయన ఎస్వీపీఎన్పీఏ అకాడమీని విడిచిపెట్టినట్లు సమాచారం. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్గా పనిచేసినట్లు అధికారులు తెలిపారు.
