Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
రోహిత్ శర్మ అరుదైన ఘనత

రోహిత్ శర్మ అరుదైన ఘనత

Shaik Mohammad Shaffee
20 అక్టోబర్, 2025

భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయి నమోదైంది. టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐదో భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగడం ద్వారా ఈ గౌరవప్రదమైన 'ఎలైట్ క్లబ్'లో చేరాడు.

లెజెండరీ ఆటగాళ్ల సరసన రోహిత్

భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (551+ మ్యాచ్‌లు), ఎం.ఎస్. ధోని (538 మ్యాచ్‌లు), రాహుల్ ద్రావిడ్ (509 మ్యాచ్‌లు) ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం.

మార్చి 9న దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ వన్డే మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఐపీఎల్‌లో పాల్గొన్న రోహిత్, అది జూన్‌లో ముగిసిన తర్వాత కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ తొలి వన్డే ద్వారా ఆయన అంతర్జాతీయ వన్డేల్లోకి తిరిగి వచ్చారు.

మూడు ఫార్మాట్లలో హిట్‌మ్యాన్ ప్రయాణం

2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ, అప్పటినుండి తనదైన శైలిలో భారత జట్టుకు విశేష సేవలందించాడు. ఆయన ఇప్ప‌టి వ‌ర‌కు 67 టెస్టులు, 274 వ‌న్డేలు (పెర్త్ వన్డేతో కలిపి), 159 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 40.6 స‌గ‌టుతో 4,301 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 శ‌త‌కాలు, 18 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 48.8 స‌గ‌టుతో 11,176 ప‌రుగులు సాధించాడు. ఇందులో 32 శ‌త‌కాలు, 58 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. 151 టీ20 ఇన్నింగ్స్‌లో 4,231 ప‌రుగులు సాధించాడు.

చేరుకోవాల్సిన ఇతర రికార్డులు

20,000 అంతర్జాతీయ పరుగులు: రోహిత్ శర్మకు 20,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 300 పరుగులు అవసరం. ఈ ఘనత సాధిస్తే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్‌ల తర్వాత ఈ మార్కును చేరుకున్న నాల్గవ భారతీయ ఆటగాడు అవుతాడు.

50వ అంతర్జాతీయ సెంచరీ: ప్రస్తుతం 49 సెంచరీలతో ఉన్న రోహిత్, మరో సెంచరీ సాధిస్తే తన 50వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లీ (82) మాత్రమే భారత్ తరఫున సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని చేరుకున్న 10వ క్రికెటర్‌గా రోహిత్ నిలవనున్నాడు.

వన్డేల్లో మూడో అత్యధిక రన్స్: వన్డేల్లో ఇప్పటివరకు రోహిత్ 274 మ్యాచ్‌ల్లో 11,176 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (11,221) రికార్డును అధిగమించి, భారత్ తరఫున మూడో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడానికి ఆయనకు కేవలం 45 పరుగులు మాత్రమే అవసరం.

రోహిత్ శర్మ అరుదైన ఘనత - Tholi Paluku