Let's talk: editor@tmv.in
రూ. 150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకీకరణ.. 117 కొత్త గేట్ల ఏర్పాటు: సీఎం చంద్రబాబు
రూ. 150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకీకరణ.. 117 కొత్త గేట్ల ఏర్పాటు: సీఎం చంద్రబాబు
రూ. 150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకీకరణ.. 117 కొత్త గేట్ల ఏర్పాటు: సీఎం చంద్రబాబు

రూ. 150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకీకరణ.. 117 కొత్త గేట్ల ఏర్పాటు: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
14 జులై, 2026

గోదావరి డెల్టాకు అత్యంత కీలకమైన ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకీకరణ కోసం రూ. 150 కోట్లకు పైగా వ్యయంతో 117 కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పిచ్చుకలంకలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బ్యారేజీ గేట్ల ఆధునీకీకరణ పనులను వివరించారు.

గోదావరి డెల్టా మనుగడకు అత్యంత ప్రాధాన్యమైన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్లను మేము ఆధునీకరిస్తున్నాం. బ్యారేజీ రక్షణను పటిష్టం చేసేందుకు రూ. 152 కోట్లతో 117 కొత్త గేట్లను అమర్చుతున్నామ‌ని సీఎం తెలిపారు. రాబోయే తొమ్మిది నెలల్లోనే ఈ గేట్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బ్రిటీష్ నీటిపారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన పాత బ్యారేజీ తర్వాత, మరొక బ్యారేజీ నిర్మించాల్సిన అవసరం రాగా.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆ పనులను ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ కొత్త బ్యారేజీ ద్వారా 2.9 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు, 32.2 లక్షల క్యూసెక్కుల భారీ వరదను సైతం తట్టుకోగలదని, తద్వారా తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని 10.1 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

2027 గోదావరి పుష్కరాల లోపే పోలవరం

2027లో జరగబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాల్లో ఎలాంటి నీటి కొరత ఉండదన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించామని, ఈ పట్టిసీమ ప్రాజెక్టే రాయలసీమ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చివేసిందని గుర్తుచేశారు. దీనివల్ల అక్కడ మైక్రో ఇరిగేషన్, హార్టికల్చర్, ఇతర రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు.

తాము రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని పునరుద్ఘాటించిన సీఎం.. తాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నటుడు-రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని 'విధ్వంసం నుంచి వికాసం' వైపు నడిపిస్తూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. పాఠశాలలకు వెళ్లే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15,000 అందించే 'తల్లికి వందనం' పథకం నిధులను జూలై నెలలోనే పంపిణీ చేస్తామని ప్రకటించారు.

సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ను ధ్వంసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని, 2019 తర్వాత కూడా తామే అధికారంలో ఉండి ఉంటే 2021 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని పేర్కొన్నారు. 2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం పోలవరం పనులు 89 శాతానికి చేరాయన్నారు. గత రెండేళ్లలో సాగునీటి రంగంపై రూ. 24,000 కోట్లు ఖర్చు చేశామని, తుంగభద్ర డ్యామ్‌కు కూడా 36 కొత్త గేట్లను ఏర్పాటు చేశామని వివరించారు.

రాబోయే గోదావరి పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని, పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. కేవలం రాజమండ్రిలోనే పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. 1,200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే గోదావరి ప్రాంతంలో ఒక 'కోకో సిటీ' ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్‌‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, నదులలోకి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంటూ.. రైతులు వాతావరణ పరిస్థితులను గమనించి పంటలు వేయాలని కోరారు. పిచ్చుకలంక, బొజ్జరాలలంక ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, కోనసీమ రైల్వే లైన్ కనెక్టివిటీ, గోదావరి డెల్టా ఆధునీకీకరణ పనులను చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు
AndhraPradeshChandrababuNaiduDowleswaramBarrageGodavariDeltaGodavariPolavaramProjectAPDevelopmentIrrigationProjectsWaterManagementKonaseemaRajahmundryGodavariPushkaralu