
రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన రష్మిక
ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ఆదివారం జూబిలీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి విచ్చేసి, సీఎం ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తన వివాహ రిసెప్షన్కు సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో నటుడు విజయ్ దేవరకొండతో ఆమె వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. వివాహానంతరం హైదరాబాద్లో మార్చి 4న జరగనున్నతన రిసెప్షన్ కు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి సతీమణి గీత రెడ్డికి రష్మిక స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రష్మికకు ఆత్మీయ స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా ఆమెకు కుంకుమ తిలకం దిద్ది, పుష్పగుచ్చం అందించి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోతున్న రష్మిక, గీత రెడ్డితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వివాహ రిసెప్షన్ కు రాజకీయ ప్రముఖులతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరుకానున్నారు.
కాగా విజయ్ దేవరకొండ, రష్మి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ.. పెళ్లి బంధంతో అధికారికంగా ఒక్కటి కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో తమ నటనతో మెప్పించిన ఈ జంట నిజ జీవితంలోనూ జంటగా మారడం విశేషం. వివాహ వేడుక రాజస్థాన్లో ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్లో జరగనున్న రిసెప్షన్ పైనే ఉంది.
