
రాజవొమ్మంగి అడవుల్లోకి కూర్మాపురం పెద్ద పులి
గత కొన్ని రోజులుగా పోలవరం పరిసర అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న శాటిలైట్ కాలర్ అమర్చిన మగ పులి ప్రస్తుతం రంపచోడవరం డివిజన్లోని రాజవొమ్మంగి అటవీ రేంజ్లోకి ప్రవేశించినాట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు సోమవారం తెలిపారు. పాపికొండల జాతీయ ఉద్యానవనం నుంచి ఏలేరు రిజర్వాయర్ పరిసరాల మీదుగా ప్రయాణిస్తూ ఈ పులి కొత్త ఆవాసం కోసం రాజవొమ్మంగి అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీ సిబ్బంది దాని కదలికలను అత్యాధునిక పరికరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ పులి గతంలో తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురం గ్రామస్తులను వణికించిన సంగతి తెలిసిందే. సుమారు మూడు సంవత్సరాల వయస్సు కలిగిన ఈ మగ పులి, ఫిబ్రవరి 6న జనావాసాల్లోకి వచ్చి పశువులపై దాడులు చేయడంతో అటవీ శాఖ దీనిని చాకచక్యంగా బంధించింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్కు తరలించారు. అక్కడ కొంతకాలం అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత పులి పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో పాటు అడవి వాతావరణంలో వేటాడే సామర్థ్యం కలిగి ఉందని గుర్తించి దానిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. పులి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు వీలుగా దాని మెడకు శాటిలైట్ కాలర్ను అమర్చారు.
తాజాగా రాజవొమ్మంగి రేంజ్లోకి ప్రవేశించిన ఈ పులి అటవీ అంచున ఉన్న మారివేడు గ్రామ సమీపంలో కొన్ని పశువులను వేటాడినట్లు అధికారులు గుర్తించారు. పులి మెడకు ఉన్న కాలర్ నుంచి అందుతున్న డేటా, వెరీ హై ఫ్రీక్వెన్సీ సంకేతాలు, క్షేత్రస్థాయిలో లభించిన పులి అడుగుల ముద్రల (పగ్మార్క్స్) ఆధారంగా అది ఏ దిశలో ప్రయాణిస్తుందో అధికారులు అంచనా వేస్తున్నారు. మగ పులులు సాధారణంగా తమ పరిధిని (టెరిటరీ) విస్తరించుకోవడానికి కొత్త ప్రాంతాల కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తుంటాయని ఈ క్రమంలోనే ఇది రాజవొమ్మంగి అడవులకు చేరుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పులి సంచారం నేపథ్యంలో అటవీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొలాలకు,అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రజల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని డివిజనల్ అటవీ అధికారులు తెలిపారు. పులి మళ్లీ జనావాసాల వైపునకు వచ్చే సూచనలు కనిపిస్తే వెంటనే చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే స్థానిక సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.
