Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్‌

రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్‌

Panthagani Anusha
6 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు కస్టడీ హింస కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ డీఐజీ ఎం. సునీల్ కుమార్ నాయక్ గురువారం గుంటూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన దర్యాప్తు అధికారుల ముందుకు రాగా దాదాపు ఏడు గంటల పాటు పోలీసులు ఆయన్ను సునిశితంగా ప్రశ్నించారు.

కేసు నేపథ్యం

2021 మే నెలలో రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి వైకాపా ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేసేవారు. ఈ క్రమంలో, ఆయన తన ప్రసంగాల ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. అరెస్ట్ చేసిన ఆ రాత్రి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తనను కాళ్లపై కొట్టి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారని రఘురామకృష్ణంరాజు అప్పట్లోనే ఆరోపించారు. అప్పటి సీఐడీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని ఆ సమయంలో డీఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్ కూడా అక్కడ ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఈ కేసులో 7వ నిందితుడిగా చేర్చారు.

ఏడు గంటల పాటు ప్రశ్నల పరంపర

విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఈ విచారణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సునీల్ కుమార్ నాయక్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఆ రాత్రి సీఐడీ ఆఫీసులో ఏం జరిగింది? రఘురామపై దాడి జరిగినప్పుడు ఆయన పాత్ర ఏమిటి? అనే అంశాలపై వివరాలు సేకరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఆయన విచారణకు రావాల్సి ఉంది.

కోర్టు ఆదేశాలతో విచారణకు..

గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చినా సునీల్ కుమార్ స్పందించకపోవడంతో, ఏపీ పోలీసులు బీహార్‌లోని పాట్నాకు వెళ్లి ఆయన్ను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. చివరకు ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన స్వయంగా గుంటూరుకు వచ్చి పోలీసుల ముందు హాజరయ్యారు. రాబోయే నాలుగు రోజులు కూడా ఈ విచారణ కొనసాగనుంది.

రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్‌ - Tholi Paluku