Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
యూపీలో ఇంధన కొరత వదంతులు.. పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూలు

యూపీలో ఇంధన కొరత వదంతులు.. పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూలు

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా భారత్‌లో పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ కొరత తలెత్తుతుందనే వదంతులు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. ఈ వదంతుల ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఇంధన కొరత వస్తుందనే భయంతో ప్రజలు ముందుగానే పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో బంక్‌లకు తరలివచ్చారు.

నిఘాసన్, పల్లియా, భీరా ప్రాంతాల్లోని అనేక ఇంధన కేంద్రాల వద్ద వాహనదారులు పొడవాటి క్యూల్లో నిలబడి పెట్రోలు, డీజిల్ తీసుకునేందుకు ప్రయత్నించారు. కొంతమంది అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవాలని ప్రయత్నించినట్లు కూడా సమాచారం. దీంతో కొన్ని బంక్‌ల వద్ద తాత్కాలికంగా రద్దీ పెరిగి వాహనాల రాకపోకలు కూడా మందగించాయి.

అయితే జిల్లాలో ఇంధన కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా సరఫరా అధికారి అంజనీ కుమార్ సింగ్ మాట్లాడుతూ, పెట్రోలు, డీజిల్ లేదా ఎల్పీజీ కొరత ఉందనే వార్తలు పూర్తిగా అసత్యమని చెప్పారు. జిల్లాలో పెట్రోలియం ఉత్పత్తుల సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు వదంతులను నమ్మి అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.

జిల్లా కలెక్టర్ దుర్గా శక్తి నాగపాల్ కూడా ఈ పరిస్థితిపై స్పందిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, ఎలాంటి ఇంధన సంక్షోభం లేదని తెలిపారు. వదంతులను నమ్మి భయపడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక ఖేరి పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ దిక్షిత్ మాట్లాడుతూ జిల్లాలోని పెట్రోల్ బంక్‌ల వద్ద వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు కూడా సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ, పశ్చిమ ఆసియా పరిస్థితులతో సంబంధం లేకుండా జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోందని, వదంతులను నమ్మి భయాందోళనలకు లోనవ్వకుండా ఉండాలని కోరుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో వదంతుల కారణంగా మిగతా రాష్ట్రాలలో కొంతసేపు పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూలు కనిపించినప్పటికీ, ప్రస్తుతం ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీకి సరిపడా నిల్వలు ఉన్నాయని ఇప్పటికే స్పష్టం చేశాయి.

భారతదేశం అవసరమైన ముడి చమురును ప్రపంచంలోని పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా వెంటనే ఇంధన కొరత వచ్చే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అవసరమైనంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

యూపీలో ఇంధన కొరత వదంతులు.. పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూలు - Tholi Paluku