
యూడీఎఫ్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: కేరళ సీఎం
కేరళలో ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యరోపణలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)పై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం పాలక్కాడ్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, మల్లపురంలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) మద్దతు అంశంపై యూడీఎఫ్ నేతలు పూర్తిగా అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని తమ ప్రో-కార్పొరేట్, గ్లోబలిస్టు విధానాల నుంచి మళ్లించేందుకు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని, అభివృద్ధి పనులతో చరిత్రాత్మకంగా రెండోసారి అధికారంలోకి వచ్చిందని విజయన్ పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా అభివృద్ధిని గమనిస్తున్నారని చెప్పారు. యూడీఎఫ్ నేతలు, ముఖ్యంగా రమేశ్ చెన్నితల, వీడీ సతీశన్ నిరాధార ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎల్డీఎఫ్ వ్యూహాలను తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది సీపీఎం మాత్రమే
ఇదే సమయంలో, ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్న యూడీఎఫ్, వాస్తవానికి ఆర్ఎస్ఎస్ మద్దతుతోనే ఓట్లు కోరుతోందని విజయన్ ఆరోపించారు. ప్రజలు ఈ రాజకీయ ప్రాపగాండాను అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా చూసే ప్రభుత్వం ఎల్డీఎఫ్ మాత్రమేనని, అబద్ధాల ప్రచారాలకు తాము లోనవ్వబోమని స్పష్టం చేశారు. ఇక ముందుగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ. గోవిందన్ కూడా యూడీఎఫ్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిజంగా పోరాడేది సీపీఎంయేనని, యూడీఎఫ్ మాత్రం ఆర్ఎస్ఎస్తో సంబంధాలు కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. వీడీ సతీశన్ అబద్ధాలు ప్రచారం చేయడమే తన పని చేసుకున్నారని గోవిందన్ వ్యాఖ్యానించారు. అలాగే జమాత్-ఏ-ఇస్లామీ మద్దతు అంశంపై యూడీఎఫ్ మౌనం పాటిస్తుందని విమర్శించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే దశలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కిన ఈ పోరులో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
