
మాంచెస్టర్కు వెళ్తున్న ఇండిగో విమానం ఢిల్లీకి రిటర్న్
మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం మధ్యలోనే తిరిగి ఢిల్లీకి చేరుకుంది. వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎరిత్రియా గగనతలంలో ప్రవేశించే సమయంలో పరిమితులు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎయిర్లైన్ విడుదల చేసిన ప్రకటనలో, ఢిల్లీ–మాంచెస్టర్ మధ్య నడిచే 6ఈ 033 విమానం చివరి నిమిషంలో విధించిన గగనతల పరిమితుల కారణంగా తిరిగి ఢిల్లీకి రావాల్సి వచ్చిందని తెలిపింది. వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో చివరి నిమిషంలో గగనతల పరిమితులు విధించడంతో మా విమానం తిరిగి ఢిల్లీకి చేరింది. ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
సమాచారం ప్రకారం ఎరిత్రియా గగనతలంలోకి ప్రవేశించడానికి అవసరమైన అనుమతుల విషయంలో సమస్యలు తలెత్తడంతో భద్రతా పరమైన సమీక్ష తర్వాత విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం యూరప్ నగరాలకు వెళ్లే కొన్ని విమానాల కోసం ఇండిగో, నార్వేకు చెందిన నోర్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్ నుంచి లీజ్కు తీసుకున్న బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానాలను వినియోగిస్తోంది.
మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) కొన్ని గగనతలాలను ఉపయోగించకుండా విమానాలకు ఆంక్షలు విధించింది. ఇందులో సౌదీ అరేబియా గగనతలం కూడా ఉంది. దీంతో యూరప్కు వెళ్లే విమానాలు ఇప్పుడు ఆఫ్రికా మార్గం ద్వారా ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గంలో విమానాలు సాధారణంగా అరేబియా సముద్రం మీదుగా వెళ్లి ఇథియోపియో, ఎరిత్రియా, ఎర్ర సముద్రం, ఈజిప్ట్ గగనతలాల మీదుగా యూరప్లోకి ప్రవేశిస్తాయి. ఇక ఏథెన్స్కు వెళ్లే విమానాలను మాత్రం ఎయిర్బస్ ఏ321ఎక్స్ఎల్ఆర్ విమానాలతో నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొన్ని విమానాలు పొడవైన మార్గాలు తీసుకోవాల్సి రావచ్చని లేదా మార్గం మళ్లించాల్సి రావచ్చని ఇండిగో పేర్కొంది.
