
భారత్ టీ20 వరల్డ్ కప్ ‘హ్యాట్రిక్’ కొట్టాలి: మంత్రి అజారుద్దీన్
2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి, వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టుపై మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించారు. టీమ్ ఇండియా ఇదే జోరును కొనసాగించి ప్రపంచకప్ గెలుపులో 'హ్యాట్రిక్' సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఫైనల్లో ఘన విజయం సాధించిన భారత జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్, భారత జట్టు ప్రదర్శనను కొనియాడారు. జట్టు చాలా నిలకడగా ఆడింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడం గర్వకారణం. ముఖ్యంగా సంజూ శామ్సన్ ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత తన ఆటలో పక్వత చూపించాడని కొనియాడారు.ఇదే ఆటతీరును ప్రదర్శిస్తే టీమ్ ఇండియాను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
అలాగే హైదరాబాద్కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ప్రదర్శనను కూడా అజారుద్దీన్ ప్రశంసించారు.అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా జట్టు కోసం అద్భుతంగా ఆడుతున్నాడని, అతడిని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరిస్తామని ప్రకటించారు.అలాగే 2026 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని మరో తెలంగాణ క్రీడాకారుడు ఆరోన్ జార్జ్ను కూడా సత్కరించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 255/5 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.ఈ విజయంతో భారత్ స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అలాగే వరుసగా రెండు సార్లు టైటిల్ గెలిచిన తొలి జట్టుగా, మొత్తం మూడు సార్లు (2007, 2024, 2026) ట్రోఫీ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
