
బస్తీ దవాఖానాలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
క్షేత్రస్థాయిలో సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి బీజేఆర్ నగర్ బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో స్వయంగా తెలుసుకునేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా దవాఖానాలో అందిస్తున్న అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలను సమీక్షించి, రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. ఔషధ నిల్వలను తనిఖీ చేసి, అవసరమైన మందులు సమృద్ధిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ల్యాబ్ ప్రక్రియలను పరిశీలించి, రక్తపరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షలు సమయానికి, నాణ్యత ప్రమాణాలతో జరుగుతున్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి, వైద్య సేవల నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, మందుల లభ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రజా వైద్య వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ స్వయంగా ఆరోగ్య పరీక్ష చేయించుకొని, అవసరమైన చికిత్సను కూడా పొందారు. ప్రభుత్వ దవాఖానల్లోనే నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ ఆకస్మిక తనిఖీతో బస్తీ దవాఖానల్లో సేవల మెరుగుదలకు మరింత దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.
