
బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు.. ప్రజల ఆశలకు ప్రతిబింబం: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ కేవలం కాగితాల మీద లెక్కలు కాదని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కష్టసుఖాలను వారి ఆశలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమానంగా చూస్తూ ఈ బడ్జెట్ను సిద్ధం చేశామని పవన్ వివరించారు.
ముఖ్యంగా సామాన్యుడికి భరోసా ఇచ్చేలా పెన్షన్ల కోసం ఏకంగా రూ.33,000 కోట్లు కేటాయించామని పవన్ తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వంటి నిస్సహాయులకు ఆర్థికంగా అండగా నిలవడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. కేవలం డబ్బులు పంచడమే కాకుండా రాష్ట్రం బాగుపడాలంటే మౌలిక సదుపాయాలు కూడా అవసరమని అందుకే గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రోడ్ల పనుల కంటే తమ కూటమి ప్రభుత్వం ఈ రెండు ఏళ్లలోనే రెట్టింపు స్థాయిలో అంటే 17,500 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించిందని ఆయన ప్రకటించారు.
అదేవిదంగా రాష్ట్రానికి పట్టిన 'విద్యుత్' గ్రహణం వీడిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలు లక్షల కోట్ల నష్టాల్లో మునిగిపోయాయని ఆ భారాన్ని ప్రజలపై పడకుండా 'ట్రూ-డౌన్' విధానం ద్వారా కరెంట్ ఛార్జీలు తగ్గించామని పేర్కొన్నారు. అంతేకాక పల్లెల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు 'జల జీవన్ మిషన్' ద్వారా 48,000 ప్రాంతాలకు సురక్షితమైన నీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు.
మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి వెన్న ముక్కైనా అమరావతి రాజధానిని, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయం అంటే కులాల మధ్య గొడవలు పెట్టడం కాదని అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్షం అనవసరపు విమర్శలు మానుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం రాబోయే 15 ఏళ్ల పాటు ప్రజల కోసమే పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
