
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..నేడు జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడం, తదనంతర దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలోని ఏడు దేశాల్లో సోమవారం (మార్చి 2) జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఒక అధికారిక సర్క్యులర్ను విడుదల చేసింది.
పరీక్షల వాయిదా.. ఆ దేశాల్లోనే!
పశ్చిమ ఆసియాలోని తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో సోమవారం జరగాల్సిన పరీక్షలను నిలిపివేస్తున్నట్లు బోర్డు తెలిపింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని, విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్లో ఉండాలని సూచించింది. మార్చి 3వ తేదీన గల్ఫ్ దేశాల్లోని పరిస్థితిని మరోసారి సమీక్షించి, మార్చి 5 నుంచి జరగాల్సిన పరీక్షలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.
నివురు గప్పిన నిప్పులా టెహ్రాన్
అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు విషాద దినాలను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం వరకు దించారు. ఖమేనీ అంత్యక్రియలకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 1989 నుంచి పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఇరాన్ను నడిపించిన ఖమేనీ మరణం ఆ దేశంలో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. ప్రస్తుతం టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో అల్లర్లు జరగకుండా సైన్యం పహారా కాస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య క్షిపణుల హోరు
ఇరాన్ అగ్రనేతలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో ఖమేనీతో పాటు ఇతర ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోవడం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. అయితే, తమపై జరగబోయే ముప్పును అడ్డుకోవడానికే ఈ దాడులు చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అటు యుద్ధ భయంతో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతుండగా, వారి భద్రతను దృష్టిలో ఉంచుకునే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
