
పరారీలో ఉన్న పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే పఠాన్మజ్రా అరెస్ట్
అత్యాచారం కేసులో ఆరు నెలలుగా పరారీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాను పంజాబ్ పోలీసులు మంగళవారం రాత్రి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పరిసర ప్రాంతంలో అరెస్టు చేశారు. సనౌర్ నియోజకవర్గానికి చెందిన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పఠాన్మజ్రాను పట్టుకుని పటియాలాకు తరలించినట్లు ఎస్ఎస్పీ వరుణ్ శర్మ తెలిపారు. కఠిన భద్రత మధ్య కోర్టులో హాజరుపరచగా, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 1న పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో పఠాన్మజ్రాపై అత్యాచారం, మోసం, బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. జిరాక్పూర్కు చెందిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, తాను విడాకులు తీసుకున్నానని చెప్పి సంబంధం పెట్టుకుని, ఇప్పటికే వివాహితుడై ఉన్నప్పటికీ 2021లో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అనంతరం లైంగిక దోపిడీ, బెదిరింపులు, అసభ్యకర సందేశాలు పంపాడని బాధితురాలు పేర్కొంది.
ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో పఠాన్మజ్రాను కోర్టు ‘ప్రక్లెయిమ్డ్ ఆఫెండర్’గా ప్రకటించింది. అతనిపై లుక్అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి పరారీలో ఉన్న ఆయనను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. అరెస్టు కోసం హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ప్రయత్నించినప్పుడు ఆయన పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అప్పట్లో తన అనుచరులు రాళ్లు రువ్వడం, కాల్పులు జరపడం జరిగిందని పోలీసులు ఆరోపించారు. అయితే, నకిలీ ఎన్కౌంటర్ భయంతో పారిపోయానని పఠాన్మజ్రా చెప్పాడు. తర్వాత విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కేసు రాజకీయ కుట్ర అని ఆరోపించిన ఆయన, బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగి వస్తానని పేర్కొన్నారు. చివరకు సాంకేతిక ఆధారాలు, మానవ సమాచారంతో పోలీసులు అతని జాడ కనుగొని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
