
నేడు ఢిల్లీలో పింక్ మొబిలిటీ కార్డ్ ప్రారంభం
ఢిల్లీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)ను సోమవారం ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ‘సశక్త్ నారీ, సమృద్ధ్ ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగనుంది.
పింక్ కార్డ్ ప్రత్యేకతలు
ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకారం, పింక్ కార్డ్ ద్వారా ఢిల్లీలో నివసించే అర్హత కలిగిన మహిళలు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదే కార్డ్ను మెట్రో, రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) తదితర ప్రజా రవాణా సేవల్లో చెల్లింపు ప్రయాణానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకం కింద మూడు రకాల కార్డులు జారీ చేస్తారు:
• పింక్ కార్డ్ – అర్హత గల మహిళలకు
• బ్లూ కార్డ్ – సాధారణ ప్రయాణికులకు
• ఆరెంజ్ కార్డ్ – నెలవారీ పాస్ వినియోగదారులకు
మొదటి దశలో పింక్, బ్లూ కార్డులు విడుదల చేస్తారు.
ఆధార్–మొబైల్ లింక్
పింక్ కార్డ్ను ఆధార్, మొబైల్ నంబర్తో లింక్ చేసి వయస్సు, లింగం, ఢిల్లీ నివాసాన్ని ధృవీకరించనున్నారు. సుమారు 50 కేంద్రాల్లో (డీఎం, ఎస్డీఎం కార్యాలయాలు, ఎంపిక చేసిన డీటీసీ కేంద్రాలు) కార్డులు జారీ చేయబడతాయి. కనిష్ట పత్రాలతో ప్రక్రియ సరళంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
పేపర్ టికెట్లకు బదులు డిజిటల్ వ్యవస్థ
ప్రస్తుతం అమలులో ఉన్న పేపర్ పింక్ టికెట్లకు బదులుగా ఈ స్మార్ట్ కార్డ్ ప్రవేశపెట్టబడుతోంది. టచ్-ఫ్రీ ట్రావెల్, డిజిటల్ ప్రయాణ రికార్డులు, పారదర్శక లెక్కలు వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. పింక్ కార్డ్ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది.
ఉచిత ఎల్పీజీ సిలిండర్లు
ఇ దే కార్యక్రమంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు హోలీ, దీపావళి సందర్భాల్లో సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించే పథకాన్ని కూడా రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా సబ్సిడీ మొత్తాన్ని కుటుంబ యజమాని ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. సుమారు 15.5 లక్షల కుటుంబాలకు ఈ ప్రయోజనం అందుతుందని అంచనా. ఈ చర్యలు మహిళల ఆర్థిక భారం తగ్గించి, ప్రజా రవాణాను మరింత సులభం, డిజిటల్, మహిళా అనుకూలంగా మార్చేందుకు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది.
