
దేశవ్యాప్త టోల్ ప్లాజాల్లో 5,100 మంది మహిళా సిబ్బంది నియామకం: ఎన్హెచ్ఏఐ
దేశవ్యాప్త జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఇకపై మహిళా సిబ్బంది విధుల్లో చేరనున్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించడంతో పాటు టోల్ కార్యకలాపాల్లో పారదర్శకత, మర్యాదపూర్వక సేవలను అందించే లక్ష్యంతో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) భారీ స్థాయిలో మహిళలకు ఉపాధి కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద పగటి పూట షిఫ్టులలో ఇప్పటికే 5,100 మందికి పైగా మహిళా సిబ్బందిని నియమించినట్లు ఎన్హెచ్ఏఐ శుక్రవారం వెల్లడించింది.
సౌకర్యవంతమైన ప్రయాణం.. వివాదాలకు స్వస్తి
టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు మెరుగైన అనుభూతిని అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. మహిళా సిబ్బంది ఉండటం వల్ల ప్రయాణికులతో మర్యాదపూర్వకమైన ప్రవర్తన పెరుగుతుందని, తద్వారా టోల్ బూత్ల వద్ద తరచుగా తలెత్తే వాగ్వాదాలు, ఘర్షణలు తగ్గుతాయని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. సమర్థవంతమైన, స్నేహపూర్వక వాతావరణంలో టోల్ వసూలు ప్రక్రియ సాగేలా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
స్టేక్ హోల్డర్ల ఏకగ్రీవ మద్దతు
ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి ముందు ఎన్హెచ్ఏఐ వివిధ భాగస్వామ్య పక్షాలతో లోతైన చర్చలు జరిపింది. నేషనల్ హైవేస్ బిల్డర్ ఫెడరేషన్, హైవే ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా యూజర్ ఫీ కాంట్రాక్టర్స్ ఫెడరేషన్ వంటి కీలక సంఘాలతో సంప్రదింపుల తర్వాత, పగటి వేళల్లో మహిళా సిబ్బందిని నియమించడానికి టోల్ ఆపరేటర్లందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇప్పటికే 5,100 మంది విధుల్లో చేరగా, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
గ్రామీణ మహిళలకు ఉపాధి.. ప్రత్యేక శిక్షణ
ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఈ నిర్ణయం వరంలా మారనుంది. మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని మౌలిక సదుపాయాల రంగంలో భాగస్వాములను చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం వారికి టోల్ వసూలు చేసే విధానం, వాహనదారులతో మర్యాదగా ప్రవర్తించడం, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించడం, భద్రతా నియమాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పిస్తూనే, ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఎన్హెచ్ఏఐ నిరంతరం పర్యవేక్షిస్తుంది.
