
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, వీరిద్దరూ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.
తన ఎన్నిక ఖరారైన అనంతరం వేం. నరేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన ఎంఐఎం, సీపీఐ పార్టీలకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఇద్దరు అభ్యర్థులు మార్చి 5న హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, పరిశీలన సమయంలో అది తిరస్కరించబడింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేల ప్రతిపాదనలు అవసరం.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన సింఘ్వీ, తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో ఏడాదిన్నర కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నరేందర్రెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
