
ఖమేనీ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిపై దేశంలోని పలు ప్రాంతాల్లో షియా సమాజం నిరసనలు చేపట్టింది. కాశ్మీర్ నుంచి కర్ణాటక వరకు శోక ర్యాలీలు, ప్రార్థనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. టెహ్రాన్లో శనివారం జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ధృవీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. భారత్లోనూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగాయి.
కాశ్మీర్లో భారీ నిరసనలు
సుమారు 15 లక్షల షియా జనాభా ఉన్న కాశ్మీర్లో లాల్చౌక్, సైదా కడల్, బడ్గామ్, బండిపోరా, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. నిరసనకారులు ఛాతీ కొట్టుకుంటూ అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేక నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసి ప్రజలు శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్లో ఉన్న జమ్మూ–కాశ్మీర్ విద్యార్థుల భద్రత కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఖమేనీ హత్యను ఖండిస్తూ, ప్రజలు గౌరవప్రదంగా శోకాన్ని వ్యక్తం చేసేందుకు యంత్రాంగం సహకరించాలని కోరారు. కాశ్మీర్ మతపెద్ద మీర్వేజ్ ఉమర్ ఫరూక్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
లక్నోలో ఆందోళనలు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బారా ఇమాంబారా సమీపంలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసనలు చేపట్టారు. మహిళలు ఖమేనీ ఫోటోలు పట్టుకుని విలపించారు. ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ సోమవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని తెలిపారు. షియా సమాజం మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించింది.
ఇతర రాష్ట్రాల్లో స్పందన
పంజాబ్లోని లుధియానాలో కూడా నిరసనలు జరిగాయి. శాహీ ఇమామ్ మౌలానా మహమ్మద్ ఉస్మాన్ రహ్మానీ కేంద్రం వారం రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్లో షియా సమాజం మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించింది. దొరై, తారాగఢ్ దర్గాల్లో సంతాప సభలు నిర్వహించారు. న్యూఢిల్లీ, బీహార్, ఝార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నిరసనకారులు ఖమేనీ ఫోటోలు పట్టుకుని అమెరికా–ఇజ్రాయెల్ చర్యలను ఖండించారు.
కర్ణాటకలో నిశ్శబ్ద సంతాపం
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా అలిపుర గ్రామంలో మాత్రం నిశ్శబ్ద సంతాపం పాటించారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయగా, మూడు రోజుల పాటు అన్ని వేడుకలు నిలిపివేశారు. 1986లో ఖమేనీ గ్రామాన్ని సందర్శించినట్టు స్థానికులు తెలిపారు. దేశవ్యాప్తంగా షియా సమాజం ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ శోక సభలు, ర్యాలీలు కొనసాగిస్తోంది.
