
కునోలో చిరుత జ్వాలాకు ఐదు పిల్లల జననం
భారతదేశంలో చేపట్టిన చిరుత పునరావాస ప్రాజెక్ట్ మరో కీలక మైలురాయి చేరుకుంది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలా సోమవారం ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో దేశంలో చిరుతల మొత్తం సంఖ్య 53కు చేరింది. ఈ ఐదు పిల్లల జననంతో భారత్లో జన్మించి జీవిస్తున్న చిరుత పిల్లల సంఖ్య 33కి పెరిగింది. ఇది దేశంలో జరిగిన 10వ విజయవంతమైన చిరుత ప్రసవంగా అధికారులు తెలిపారు. ఈ విజయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. కునో నేషనల్ పార్క్ నుంచి మరో మంచి వార్త వచ్చింది. చిరుత జ్వాలా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చిరుతల సంఖ్య 50 దాటింది. ఇది వన్యప్రాణి సంరక్షణకు గర్వకారణం, ప్రాజెక్ట్ చీతా విజయానికి నిదర్శనమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
33కి పెరిగిన చిరుత పిల్లల సంఖ్య
అదేవిధంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ఈ అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేశారు. జ్వాలా మూడోసారి విజయవంతంగా పిల్లలకు జన్మనివ్వడం గర్వకారణమని తెలిపారు. జ్వాలా ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో దేశంలో చిరుత పిల్లల సంఖ్య 33కి పెరిగింది. ఇది భారతదేశ చిరుత సంరక్షణ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి అని ఆయన తెలిపారు.
ఈ విజయానికి కృషి చేసిన వెటర్నరీ వైద్యులు, ఫీల్డ్ సిబ్బంది, ప్రాజెక్ట్కు సంబంధించి పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఆయన అభినందించారు. భారతదేశంలో చిరుతలను తిరిగి స్థాపించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ చీతా ప్రపంచంలోనే మొదటి అంతర్జాతీయ చిరుత పునరావాస ప్రాజెక్ట్గా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్ను 2022 సెప్టెంబర్ 17న ప్రారంభించారు. భారత్లో చిరుతలు 1952లో అంతరించిపోయాయి. వాటిని తిరిగి దేశంలో స్థాపించాలనే లక్ష్యంతో నమీబియా, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. జ్వాలా పిల్లల జననంతో భారత్లో చిరుత సంరక్షణకు మరో చారిత్రాత్మక అడుగు పడిందని అధికారులు తెలిపారు.
