
కరీంనగర్లో స్వచ్ఛత సందేశంతో 2కే రన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాల శుభ్రత, ఆరోగ్యం, రహదారి భద్రత, మహిళా సాధికారత వంటి పది ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ నగరంలో కళాభారతి నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో ఆరోగ్యం, స్వచ్ఛతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ రన్ నిర్వహించారు.
2కే రన్ అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పరిసరాలను శుభ్రం చేస్తూ శ్రమదానం చేశారు. స్వచ్ఛతపై సమాజంలో చైతన్యం పెంపొందించడానికి, ప్రజలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను స్థానిక స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛతకు తమ మద్దతు తెలిపారు.
