
ఎన్ఎఫ్సీ రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపునకు ఎంపీకి వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎన్ఎఫ్సీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డితో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని శామీర్పేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంతెన విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎన్ఎఫ్సీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రాంతంలో జనాభా గణనీయంగా పెరగడం, కొత్త కాలనీలు వేగంగా విస్తరించడంతో వంతెనపై ట్రాఫిక్ భారం అధికమైందని అన్నారు. ఈ వంతెన హబ్సిగూడా నుంచి ఈసీఐఎల్కు, అలాగే బోడుప్పల్ నుంచి ఈసీఐఎల్కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.
వంతెన వెడల్పు తక్కువగా ఉండటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్సీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక కింద ఈ పనుల కోసం ఇప్పటికే నిధులు విడుదలైనట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. కావున సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వంతెన వెడల్పు పెంపునకు అనుమతి ఇవ్వాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
