Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరెజా అరాఫీ

ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరెజా అరాఫీ

Shaik Mohammad Shaffee
1 మార్చి, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిని ఎన్నుకునే వరకు దేశ పగ్గాలను చేపట్టేందుకు అయతుల్లా అలీరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆదివారం నియమించింది. టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసమే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ వైమానిక దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

గతంలో ఇస్లామిక్ విప్లవ నేత ఖొమేనీ కన్నుమూసిన తర్వాత, 1989 నుంచి సుదీర్ఘ కాలం పాటు ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. ఆయన మరణం నేపథ్యంలో ఏర్పడిన నాయకత్వ శూన్యాన్ని భర్తీ చేసేందుకు రాజ్యాంగంలోని 111వ అధికరణం ప్రకారం ఈ అత్యవసర ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అరాఫీ నేతృత్వంలోని త్రిసభ్య మండలి దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనుంది.

త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో దేశ పాలన

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆయతుల్లా అరాఫీతో పాటు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ప్రధాన న్యాయమూర్తి గులాం హుస్సేన్ మొహ్సేనీ ఎజెయిలు సంయుక్తంగా దేశాన్ని నడిపించనున్నారు. సాంప్రదాయకంగా మత గురువులే సుప్రీం లీడర్‌గా ఉండే ఇరాన్ వ్యవస్థలో.. ఈ ముగ్గురిలో అరాఫీకి అత్యున్నత ప్రాధాన్యత లభించనుంది. 1959లో జన్మించిన 67 ఏళ్ల అరాఫీ, ఇప్పటికే ఇస్లామిక్ సెమినరీల నెట్‌వర్క్ అధిపతిగా, గార్డియన్ కౌన్సిల్, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మరణం తర్వాత ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించే బాధ్యత ఇప్పుడు ఆయన భుజస్కంధాలపై పడింది.

సైన్యంలోనూ భారీ మార్పులు.. కొత్త చీఫ్‌గా వహీదీ

టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఖమేనీతో పాటు ఇరాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దోల్ రహీమ్ మూసవి, రక్షణ మంత్రి జనరల్ అజీజ్ నాసిర్జాదే, ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ మహమ్మద్ పాక్పూర్ సహా సుమారు 200 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నూతన చీఫ్‌గా అహ్మద్ వహీదీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో ప్రభావం చూపే ఐఆర్‌జీసీని యుద్ధ సమయంలో నడిపించడం వహీదీకి పెద్ద సవాలుగా మారనుంది.

మారణహోమంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఖమేనీ అంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. "చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఒకడైన ఖమేనీ అంతమయ్యాడు. ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాకుండా, అతడి ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు, ప్రపంచ ప్రజలందరికీ లభించిన న్యాయం" అని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. తొలుత ఖమేనీ మరణ వార్తలను ఖండించిన ఇరాన్, ఆదివారం ఉదయం అధికారికంగా ధృవీకరించడంతో ఆ దేశం ఇప్పుడు తీవ్ర అనిశ్చితి, నాయకత్వ సంక్షోభంలో మునిగిపోయింది.

.

ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరెజా అరాఫీ - Tholi Paluku