
ఆగస్టు 26నే మిలాద్-ఉన్-నబీ సెలవు
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు తేదీని మార్చింది. గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును ఆగస్టు 26, 2026 (బుధవారం)కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (పొలిటికల్-బి) శాఖ జి.ఓ.ఆర్.టి. నం.1675, తేదీ: 20-08-2026ను విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నం.2277, తేదీ: 04-12-2025 ద్వారా మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆగస్టు 25న సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నెలవంక ఆధారంగా పర్వదినం తేదీలో మార్పు చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం.. 2026 ఆగస్టు 12న రబీ ఉల్ అవ్వల్ నెలవంక కనబడలేదు. నెలవంక ఆధారిత ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రబీ ఉల్ అవ్వల్ 12వ తేదీ అయిన మిలాద్-ఉన్-నబీ ఆగస్టు 26న వస్తుందని వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి నివేదించింది. వక్ఫ్ బోర్డు అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 కింద ప్రకటించిన సెలవును ఆగస్టు 25 నుంచి ఆగస్టు 26కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసాధారణ గెజిట్లో సవరణ నోటిఫికేషన్ను కూడా ప్రచురించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
