
సర్ ప్రక్రియలో అవకతవకలపై ఈసీకి వైఎస్సార్సీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అమలులో పలు అవకతవకలు, సాంకేతిక ఇబ్బందులు, పరిపాలనా లోపాలు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ అంశాలపై తక్షణమే దృష్టి సారించి అవసరమైన సరిదిద్దే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (సీఈవో) ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కు లేఖ రాస్తూ, సర్ అమలులో ఎదురవుతున్న పలు సమస్యలను వివరించారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణకు ఈ అంశాలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సర్ విధుల్లో నియమించబడిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమ సాధారణ శాఖల పనులతో పాటు ఓటరు జాబితా సవరణ బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తోందని అప్పిరెడ్డి తెలిపారు. సర్ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు వారిని సాధారణ విధుల కోసం పిలుస్తుండటంతో, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు.
సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్వోలు తమ సమయాన్ని పూర్తిగా ఈ కార్యక్రమానికే కేటాయించేలా అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఓటర్లకు బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారమ్లు (ఈఎఫ్లు) పంపిణీ చేస్తున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో వాటిని సక్రమంగా సేకరించడం, ధృవీకరించడం, నమోదు చేయడం జరగడం లేదని అప్పిరెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల దరఖాస్తుల స్థితిగతులపై గందరగోళం నెలకొంటోందని ఆయన అన్నారు.
సర్ కార్యక్రమం ఉద్దేశ్యం, విధానం, గడువులపై ప్రజల్లో తగిన అవగాహన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలు, పట్టణాల్లో మైక్ ప్రకటనలు, స్థానిక ప్రచార కార్యక్రమాలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల అధికారులను కోరారు. అలాగే, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కూడా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఫారాల పంపిణీ, సేకరణలో గందరగోళం
క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నప్పటికీ, చాలా చోట్ల వాటిని సరిగ్గా సేకరించడం, ధృవీకరించడం, ఫైల్ చేయడం జరగడం లేదని లేఖలో వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ ఫారమ్లు అందజేస్తున్నారని, అందులో ఒకటి రసీదుగా ఉపయోగించాల్సి ఉండగా, రెండు ఫారమ్లను కూడా తిరిగి సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఒక్క ఫారమ్ మాత్రమే ఇస్తున్నారని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలులో ఏకరీతి లేకుండా పోతోందని పేర్కొన్నారు.
పాలకపక్షానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కొన్ని ప్రాంతాల్లో బీఎల్వోల నుంచి ఎన్యూమరేషన్ ఫారమ్లను పెద్ద ఎత్తున సేకరించి, అనంతరం వాటిని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని అప్పిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలు నిజమైతే, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తటస్థత, పారదర్శకతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ జోక్యం..
అదేవిధంగా, కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు బీఎల్వోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటరు జాబితా సవరణ అనేది స్వతంత్ర చట్టబద్ధ ప్రక్రియ అని, రాజకీయ జోక్యం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటర్ల ఫొటోలను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సేకరించే అధికారం బీఎల్వోలకు ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో నిర్దేశిత విధానాన్ని పాటించడం లేదని అప్పిరెడ్డి తెలిపారు. దీంతో డేటా సేకరణ అసంపూర్ణంగా మారుతోందని అన్నారు.
తాజా ఓటర్ల జాబితా ఇవ్వకపోవడంపై అభ్యంతరం
నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల ఫోటోలను సేకరించే అధికారం బీఎల్ఓలకు ఉన్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చాలా చోట్ల డేటా అరకొరగానే సేకరిస్తున్నారని ప్రతిపక్ష నేత చెప్పారు. వీటన్నింటికీ మించి, 2026 సంవత్సరంలో ప్రచురించిన తుది ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు గానీ, వారి బీఎల్ఏలకు గానీ ఇంకా సరఫరా చేయలేదని అప్పిరెడ్డి తప్పుపట్టారు.
జనవరి 1, 2025 నాటి ఓటర్ల జాబితాను మాత్రమే తమకు ఇచ్చారని, ఆ తర్వాత భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు జరిగాయని గుర్తుచేశారు. ఈ నవీకరించబడిన ఓటర్ల వివరాలను ప్రభుత్వం ఏప్రిల్ 2026లో ప్రచురించిందని, దీని ఆధారంగానే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తున్నారని తెలిపారు. కానీ ఆ తాజా జాబితాను తమ పార్టీ ప్రతినిధులకు అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఓటర్ల రికార్డులను సరిచూసుకోవడం కష్టంగా మారిందని, ఇది పారదర్శకతను దెబ్బతీస్తుందని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలో నెట్వర్క్ సమస్యలు
రాష్ట్రంలోని పలు ఏజెన్సీ (గిరిజన) మారుమూల ప్రాంతాలలో మొబైల్ కనెక్టివిటీ చాలా బలహీనంగా ఉందని, ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడం వల్ల ఓటర్ల డేటాను అప్లోడ్ చేయడానికి, రియల్ టైమ్ వెరిఫికేషన్ చేయడానికి బీఎల్ఓలు, బీఎల్ఏలు ఆచరణాత్మకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రజలలో మైకుల ద్వారా, స్థానిక ప్రచారం ద్వారా సర్ పై విస్తృత అవగాహన కల్పించాలని, లేదా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కోరారు. సీఈఓ వివేక్ యాదవ్ ఈ లోపాలపై తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడాలని వైయస్ఆర్సీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
