

భూమయ్యగారిపల్లె శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ జగన్కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు స్వామివారి సన్నిధిలో జరిగిన సుదర్శన హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి దీవెనలు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభం
ఆలయ పూజా కార్యక్రమాల అనంతరం జగన్ సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ఆయన జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను, ఎడ్ల యజమానులను, ఈ గ్రామీణ క్రీడా పోటీల నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబానికి పరామర్శ
పర్యటన ముగింపులో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, దివంగత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారిని ఓదార్చారు. శ్రీరామిరెడ్డి పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, శ్రీరామిరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో జగన్ను చూసేందుకు, స్వాగతించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
