

మే 4న మీకు శుభవార్త అందుతుంది: సీఎం ఎం.కె. స్టాలిన్ ధీమా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 4న తమ కూటమికే విజయం లభిస్తుందని, ప్రజల నుంచి 'శుభవార్త' వింటారని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం చెన్నైలోని చింతామణిపేట 'మే డే' పార్కులో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్నికల ఫలితాలపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు.
తమ ప్రభుత్వం 'అందరికీ అన్నీ' అనే విధానంతో నడుస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. దివంగత నేత, తన తండ్రి ఎం. కరుణానిధి అడుగుజాడల్లోనే తాము నడుస్తున్నామని చెప్పారు. ఈ మే డే స్మారక పార్కును స్వయంగా కరుణానిధి నిర్మించారు. కార్మికుల హక్కుల పట్ల ఆయనకున్న గౌరవానికి ఇది నిదర్శనం. అన్నాదురై మే డేను సెలవు దినంగా ప్రకటిస్తే, అనంతరం కరుణానిధి దానిని వేతనంతో కూడిన సెలవుగా మార్చారు అని ఆయన గుర్తుచేశారు.
కార్యకర్తల కష్టానికి ఫలితం
ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. కార్మికుడికి వేతనం అనేది ఒక హక్కు. అలాగే, ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మే 4న లభిస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇది నేను ఏదో ఒపీనియన్ పోల్స్ చూసి చెప్పడం లేదు, క్షేత్రస్థాయిలో మన కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని చెబుతున్నాను అని స్టాలిన్ పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా..
ఇదిలా ఉండగా, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలపై వివిధ సంస్థలు భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, పి-మార్క్ వంటి సంస్థలు డీఎంకే కూటమికి 122 నుంచి 145 స్థానాలు లభిస్తాయని, అధికారంలోకి మళ్లీ వస్తారని అంచనా వేశాయి. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 60 నుంచి 100 స్థానాల వరకు రావచ్చని పేర్కొన్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) తన తొలి ఎన్నికల్లోనే ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీవీకేకు 98-120 స్థానాలు లభిస్తాయని, డీఎంకే రెండో స్థానానికి పరిమితం కావచ్చని విశ్లేషించింది. అయితే ఇతర సంస్థలు టీవీకేకు తక్కువ స్థానాలనే కేటాయించాయి. మే 4న వెలువడనున్న తుది ఫలితాలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
