Let's talk: editor@tmv.in
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

Panthagani Anusha
29 ఏప్రిల్, 2026

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉన్నతాధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలోకి ప్రవేశించిన ఉపరాష్ట్రపతి, ధ్వజస్తంభం వద్ద భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం గర్భాలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఉపరాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి జ్ఞాపికను, చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.

శ్రీవారి దర్శనంతో పాటు ఆలయ ప్రాంగణంలోని వకుళమాత, విమాన వేంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి ఉపాలయాలను కూడా ఆయన సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపరాష్ట్రపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు ఎంతో తృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ - Tholi Paluku