
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రెండు విమానాలు ఢీ.. డీజీసీఏ దర్యాప్తు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గురువారం మధ్యాహ్నం రెండు విమానాలు ఒకదానితో ఒకటి తాకి దెబ్బతిన్న ఘటన జరిగింది. ఈ ఘటనపై డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. అధికారుల సమాచారం ప్రకారం, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాలు ఢిల్లీ విమానాశ్రయంలో టాక్సీవే వద్ద ఒకదానితో ఒకటి తాక్కున్నాయి. ఈ ఘటన తర్వాత రెండు విమానాలను కూడా గ్రౌండ్ చేశారు. మధ్యాహ్నం 2.15 గంటలకు టర్మినల్-1 వద్ద ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆకాశ ఎయిర్కు చెందిన విమానం టాక్సీవేపై నిలిచివుండగా, స్పైస్జెట్ విమానం పార్కింగ్ బే వైపు టాక్సీ అవుతోంది.
ఆకాశ ఎయిర్ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన క్యూపీ-1406 ఫ్లైట్ కాగా, స్పైస్జెట్ విమానం లేహ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎస్జీ-124 ఫ్లైట్ అని అధికారులు తెలిపారు. డీజీసీఏ ప్రకటన ప్రకారం, స్పైస్జెట్కు చెందిన బోయింగ్ 737-700 విమానం కుడి వైపు వింగ్లెట్ ఆకాశఎయిర్ విమానం హారిజాంటల్ టెయిల్ సర్ఫేస్ను తాకింది. ఈ ప్రభావంతో స్పైస్జెట్ విమానం కుడి వింగ్లెట్, ఆకాశ విమానం వెనుక భాగం దెబ్బతిన్నాయి. ఆకాశ ఎయిర్ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ-హైదరాబాద్ క్యూపీ-1406 ఫ్లైట్ కోసం సిద్ధంగా ఉన్న తమ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం బేకు తిరిగి తీసుకువచ్చారు. అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు కంపెనీ తెలిపింది. స్పైస్జెట్ కూడా తమ విమానం టాక్సీ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, కుడి వింగ్లెట్ దెబ్బతిన్నందున విమానాన్ని గ్రౌండ్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే రెండు విమానాల రెక్కలు ఒకదానితో ఒకటి తాకినట్లు ప్రాథమిక సమాచారం ఉందని అధికారులు తెలిపారు. రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై మాత్రం వివరాలు ఇంకా తెలియరాలేదు.
