
అస్థిపంజరంతో మళ్లీ 3 కి.మీ నడిపించారు: బీజేడీ
ఒడిశాలో కలకలం రేపిన ‘అస్థిపంజరం ఘటన’పై కొత్త ఆరోపణలు బయటకు వచ్చాయి. తన సోదరి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన గిరిజనుడు జీతూ ముండాను, తరువాత ఆ అవశేషాలను తిరిగి శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు 3 కిలోమీటర్లు నడిపించారని బీజేడీ నాయకులు ఆరోపించారు. ఘాసిపురా ఎమ్మెల్యే, మాజీ మంత్రి బద్రి నారాయణ్ పాత్రా నాయకత్వంలోని బీజేడీ నిజ నిర్ధారణ బృందం దియానాలి గ్రామాన్ని సందర్శించి, బాధితుడు జీతూ ముండాను కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముండా బ్యాంకు, స్థానిక అధికారుల నుంచి పలుమార్లు అమానవీయ ప్రవర్తనకు గురయ్యాడని అన్నారు.
అనారోగ్యంతో ఉన్నప్పుడే సహాయం చేయలేదు
ముండా తన సోదరి అనారోగ్యంతో ఉన్న సమయంలోనే ఖాతాలో ఉన్న డబ్బు ఇవ్వాలని అధికారులను కోరినప్పటికీ సహకరించలేదని పాత్రా తెలిపారు. పశువులను అమ్మి కుటుంబం రూ.19,300 జమ చేసిందని, అయితే బ్యాంక్ అధికారులు ఆమెను స్వయంగా తీసుకురావాలని చెప్పినట్లు ఆరోపించారు.
అస్థిపంజరంతో 3 కి.మీ నడిపించారన్న ఆరోపణ
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు జోక్యం చేసుకున్నారని, తవ్వి తీసిన అస్థిపంజరాన్ని తిరిగి శ్మశానవాటికకు తీసుకెళ్లమని ముండాను కోరారని ఆయన తెలిపారు. పోలీసులు జీపులో వెనుక వస్తుండగా, ముండా మళ్లీ ఆ అవశేషాలను భుజాన వేసుకుని సుమారు 3 కిలోమీటర్లు నడిచాడని పేర్కొన్నారు. ఇది క్రూరమైన, సిగ్గుచేటైన ఘటన. మృతదేహాన్ని తరలించేందుకు అధికారులు వాహనం ఏర్పాటు చేయలేకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు.
రాజకీయ విమర్శలు
ఈ ఘటనపై బీజేడీ తీవ్రంగా స్పందించింది. గిరిజన వ్యక్తి తన సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లడం రాష్ట్రానికి అవమానం. ఇది పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని, తిరిగి పూడ్చే సమయంలో కూడా మళ్లీ నడిపించడం మరో మానవత్వ లేని ఘటన అని పార్టీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈ ఘటనపై పరిపాలనా విచారణకు ఆదేశించారు. ఉత్తర విభాగం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ సంగ్రామ్ కేశరి మహాపాత్రను విచారణ అధికారిగా నియమించారు.
బ్యాంక్ వివరణ
ఒడిశా గ్రామీణ బ్యాంక్ మాలిపోసి శాఖ మేనేజర్ సుశాంత కుమార్ సేథి మాట్లాడుతూ, మృతదేహాన్ని తీసుకురావాలని ఎప్పుడూ అడగలేదని, కేవలం మరణ ధృవీకరణ పత్రం వంటి చట్టబద్ధ పత్రాలు మాత్రమే కోరామని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం బాధితుడికి రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ.30,000 ఆర్థిక సాయం అందించింది. అదనంగా, మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ఖాతాలోని మొత్తాన్ని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
