
కేసీఆర్తో రాజీ ప్రసక్తే లేదు.. బీఆర్ఎస్ అధ్యాయం ముగిసింది: కవిత
తెలంగాణ మాజీ సీఎం, తన తండ్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తో తన బంధం పూర్తిగా తెగిపోయిందని, ఇకపై తాను కొత్తగా స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీ భవిష్యత్తును నిర్మించడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె రాజకీయ, వ్యక్తిగత అంశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ అధ్యాయం ముగిసింది. జీవితంలో కొన్నిసార్లు పేజీలు తిప్పాలని, మరికొన్నిసార్లు పుస్తకాన్ని మూసేయాలని అంటుంటారు. నేను బీఆర్ఎస్ అనే పుస్తకాన్ని మూసేశాను. ఇప్పుడు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) తో సరికొత్త చరిత్ర రాయబోతున్నాను అని కవిత పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో తన తండ్రి కేసీఆర్ పిలిచినా, బీఆర్ఎస్తో రాజీపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చలేకపోవడం వల్ల కొన్ని "చేదు అనుభవాలు" ఎదురయ్యాయని కవిత గుర్తుచేసుకున్నారు. సామాజిక న్యాయంతో కూడిన గొప్ప తెలంగాణ ను నిర్మించడమే లక్ష్యంగా తాము ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. అసలు కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనేది తన ప్రాథమిక ప్రణాళిక కాదని.. అయితే తన బంధువులు, పార్టీలోని ఇతర నేతలపై తాను లేవనెత్తిన కొన్ని వాస్తవమైన అంశాల కారణంగా తనను బీఆర్ఎస్ నుంచి అగౌరవంగా పంపించివేశారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, కనీస అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించారు.
తెలంగాణలోని బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీలు కేవలం జాతీయ అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయని విమర్శిస్తూ, తమ తెలంగాణ రక్షణ సేన మాత్రం ప్రాంతీయ సమస్యలకే తొలి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలను బీఆర్ఎస్ విస్మరించిందని ఆరోపించిన కవిత.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఎందరో ‘స్వాతంత్ర్య సమరయోధులను’ గుర్తించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, అమరవీరుల కుటుంబాలకు తగినంత సాయం చేయలేదని విమర్శించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అంశాలపై తాను ఇంకా గట్టిగా పోరాడి ఉండాల్సిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తన మూల సిద్ధాంతాల నుంచి పక్కకు తప్పుకున్నప్పుడే, తెలంగాణ ప్రజలకు, ఆ పార్టీకి ఉన్న బొడ్డుకోత బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు
ప్రస్తుతం తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తమకు ప్రధాన ప్రతిపక్షమని కవిత పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రస్తుతం స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయని, కేవలం తమ టీఆర్ఎస్ మాత్రమే ప్రజల సమస్యలపై నిరంతరం ఆందోళనలు, నిరసనలు చేపడుతోందని చెప్పారు. గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కవిత ఇప్పుడు విమర్శలు చేయడంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. గతంలో తాను వివిధ అంశాలపై మరింత మెరుగ్గా పనిచేసి ఉండవచ్చని అంగీకరిస్తూనే, ఒక పార్టీలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. అంతమాత్రాన ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన వైఫల్యాలను గత ప్రభుత్వంపైకి నెట్టేయలేదని మండిపడ్డారు.
సింగరేణి నిధులు
తమ పార్టీ తక్షణ లక్ష్యాలలో భాగంగా పంటల కొనుగోలు, పాఠశాలల ఫీజుల నియంత్రణ వంటి ప్రజా సమస్యలపై పోరాటాలు ప్రారంభించామని కవిత తెలిపారు. దీర్ఘకాలికంగా గోదావరి, కృష్ణా నదులలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను సాధించడమే తమ లక్ష్యమన్నారు. ఇటీవల సింగరేణి గనులను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే పరిస్థితి లేకుండా సింగరేణి సంస్థకే నేరుగా రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం తమ పార్టీకి (గతంలో బీఆర్ఎస్ పాత పేరు) సంక్షిప్త నామాన్ని కేటాయించడంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు తెలపడంపై ఆమె స్పందించారు. తనకు కేవలం ఆ పేరు మాత్రమే లభించిందని చెప్పారు. మొదట్లో తన పార్టీ స్థాపనను బీఆర్ఎస్ తక్కువ చేసి మాట్లాడిందని, మరి అలాంటప్పుడు తమ కార్యకర్తలు వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోస్టర్లను బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎందుకు చింపేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు.
ఢిల్లీ లిక్కర్ కేసుపై వివరణ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు గురించి ప్రస్తావించగా.. తనపై ఎప్పుడూ అభియోగాలు నమోదు కాలేదని కవిత స్పష్టం చేశారు. ఈ కేసులో నాపై చార్జ్షీట్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు నన్ను డిశ్చార్జ్ చేస్తూ పేర్కొందని చెప్పారు. అయితే దిగువ కోర్టు నిర్ణయంపై ఈడీ, సీబీఐ సంస్థలు పైకోర్టులో అప్పీల్ చేసినందున, ఈ విషయాన్ని తాను దేవుడికి, న్యాయవ్యవస్థకే వదిలేస్తున్నానని తెలిపారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా అవినీతి రహిత రాజకీయాలతో తమ పార్టీ ఒక సరికొత్త 'విప్లవాన్ని' తీసుకువస్తుందని, భవిష్యత్తులో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు, న్యూ డెమోక్రసీ వంటి సమాన భావజాలం గల పార్టీలతో పొత్తులకు తమ పార్టీ సిద్ధంగా ఉండవచ్చని కవిత సంకేతాలు ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతిష్టను తన బంధువులైన టి. హరీష్ రావు, జె. సంతోష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆరోపించినందుకు గాను, 2025 సెప్టెంబర్లో కవితని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమె ఈ ఏడాది ఏప్రిల్లో ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీని అధికారికంగా స్థాపించారు.
