

దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం: కేటీఆర్
భారతదేశ ఆర్థిక ప్రగతిలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటివారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కేవలం పన్నుల చెల్లింపులకే పరిమితం కాకుండా, వ్యాపారాలను వ్యూహాత్మకంగా బలోపేతం చేయడంలో, దేశ నిర్మాణంలో సీఏల పాత్ర విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని అన్వయ కన్వెన్షన్లో శనివారం నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఘటికోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మారుతున్న ఆధునిక పన్ను విధానాలు, జీఎస్టీ వంటి కొత్త రూల్స్, అలాగే దేశంలో స్టార్టప్ల విపరీతమైన వృద్ధి కారణంగా అటు ప్రైవేట్ సంస్థలకు, ఇటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు చార్టర్డ్ అకౌంటెంట్లు అత్యవసరంగా మారారని చెప్పారు. ఆదాయాలు పెరగడం, వ్యాపారాలు విస్తరించడం, పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో సమాజంలో సీఏల డిమాండ్ మునుపటి కంటే చాలా పెరిగిందన్నారు.
15-20 ఏళ్ల క్రితం సీఏ కోర్సు చాలా కఠినంగా ఉంటుందనే భయంతో చాలామంది దీనిని ఎంచుకోవడానికి వెనకాడేవారు. కానీ, ఎన్నో ఒత్తిడులు, అశ్చర్యార్థకాలు, వైఫల్యాలను అధిగమించి, పట్టుదలతో ఈ అత్యంత కఠినమైన కోర్సును పూర్తి చేసిన ప్రతి ఒక్క యువతీ యువకుడు భవిష్యత్తులో ఎలాంటి సవాల్నైనా ధీటుగా ఎదుర్కొగలరని నిరూపించుకున్నారని కేటీఆర్ విద్యార్థులను అభినందించారు.
తెలంగాణ సాధించిన ప్రగతి ఇదే..
స్టార్టప్ల రంగంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కేటీఆర్ గుర్తుచేశారు. సీఏల సేవలు, పన్నుల క్రమబద్ధీకరణ వల్ల ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతుందని, అది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గణాంకాలను ఆయన ప్రస్తావించారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ స్వంత పన్ను ఆదాయం 37 శాతం కంటే ఎక్కువ వృద్ధి పెరిగిందని, ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కంటే కూడా అత్యధికం అని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర మొత్తం ఆదాయ వృద్ధి కూడా 14 శాతం నుంచి 24 శాతానికి పెరిగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు రూ.94,000 గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2023 నాటికి రూ.3 లక్షల పైచిలుకు చేరింది. ఈ విషయంలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా వంటి పెద్ద రాష్ట్రాలను కూడా తెలంగాణ అధిగమించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
టెక్నాలజీపై దృష్టి పెట్టాలి
ప్రస్తుత తరం చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. టెక్నాలజీ టూల్స్ వల్ల మానవ ఉత్పాదకత పెరగడమే కాకుండా, సీఏల పనితీరు మరింత మెరుగ్గా మారుతుందని చెప్పారు. చివరగా, విద్యార్థులు ఈ స్థాయికి చేరడం వెనుక వారి తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరువవద్దని, వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
