Let's talk: editor@tmv.in
ఏపీకి ప్రత్యేక హోదా సమస్య కాంగ్రెస్ సృష్టించినదే, ప్రధాని మోడీది కాదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీకి ప్రత్యేక హోదా సమస్య కాంగ్రెస్ సృష్టించినదే, ప్రధాని మోడీది కాదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
11 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశంపై కొనసాగుతున్న చర్చలు మరోసారి రాజకీయ వేడిని పెంచాయి. ఈ అంశానికి సంబంధించి దశాబ్ద కాలంగా సాగుతున్న సుదీర్ఘ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అవలంబించిన అసంబద్ధమైన, విభజన పూరిత విధానమే కారణమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2014లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఆదాయ వనరులకు ప్రధాన కేంద్రమైన రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడం, కొత్త ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ను కోల్పోవడమే ప్రస్తుత ఆర్థిక అసమతుల్యతకు మూలకారణమని, ఈ సంక్షోభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతమాత్రం బాధ్యులు కారని ఆయన స్పష్టం చేశారు.

మాజీ పీఎం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చినప్పటికీ, ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌పై బలంగా గళమెత్తిన ఆయన, ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ.. ఈ సమస్య గత పాలకులు వారసత్వంగా ఇచ్చిన సంక్షోభమేనని పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రధాని మోడీ సృష్టించలేదు, కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. మీ అస్తవ్యస్తమైన, విభజన పూరిత వైఖరి వల్లే రాష్ట్రం విడిపోయిందని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదాపై మారిన రాజకీయ వ్యూహం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా నిరాకరణకు నిరసనగా 2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ప్రస్తుతం తిరిగి ఆ కూటమిలోకి చేరింది. టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు కేవలం ఒక 'ప్రత్యేక హోదా' అనే ట్యాగ్ కోసం కాకుండా, రాష్ట్ర సమగ్ర వృద్ధికి అవసరమైన భారీ ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్యాకేజీల సాధనపై దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక సవాళ్లు ఇప్పుడు ఒక హోదా అనే పరిధిని దాటిపోయాయని చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ వ్యూహాత్మక మార్పును సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం ఇంకా పట్టుబట్టడం ‘ఫలితం లేని పోరాటం’ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఒక విషయాన్ని అంగీకరించి ముందుకు సాగుతున్నప్పుడు, దానికి మొత్తం కేబినెట్, అసెంబ్లీ ఆమోదం తెలిపినప్పుడు, ఇంకా దాని గురించే పట్టుబట్టడం నాకు ఒక ఫలితం లేని పోరాటంగా కనిపిస్తోందని ఆయన వివరించారు. కేవలం ఒక శాసనపరమైన ముద్ర కోసం కాకుండా, రాష్ట్ర సమగ్ర ఆర్థిక పునరావాసంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని దీని ద్వారా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

'ధురంధర్', 'బారాముల్లా' చిత్రాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

రాజకీయాలతో పాటు సినిమా అంశాలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్.. బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ లోని ధైర్యాన్ని, వైవిధ్యాన్ని తాను ఎంతగానో ఇష్టపడ్డానని కొనియాడారు. హిందీ, దక్షిణాది చిత్రాల మధ్య పోలికలు తీసుకురావడం తనకు నచ్చదని, ఏ భాషలోనైనా మంచి కథాంశాన్ని తాను అభినందిస్తానని చెప్పారు. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, ఆర్‌. మాధవన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ.. థియేటర్‌కు వెళ్లే సమయం లేకపోవడం వల్ల దీని రెండవ భాగాన్ని చూడలేకపోయానని తెలిపారు.

అలాగే ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వంలో వచ్చిన ‘బారాముల్లా’ (2025) అనే హారర్ థ్రిల్లర్ చిత్రం కూడా తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తనకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమని, అవి మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం. అవి నన్ను కథలో లీనం చేసి, నా మనస్సు ఇతర విషయాల వైపు మళ్లకుండా బంధిస్తాయి. నాకు నిద్ర రానప్పుడు హారర్ సినిమా చూస్తే నా మైండ్ ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుందన్నారు.

‘బారాముల్లా’ చిత్రం తనను 1980వ దశకం చివరి నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. 1987 నుంచి 1989 మధ్య కాలంలో తాను సినిమా షూటింగ్‌ల కోసం తరచూ శ్రీనగర్ వెళ్లేవాడినని, ఆ సమయంలోనే కశ్మీర్ లోయలో మొదలైన అశాంతి తాలూకు ఉద్రిక్తతలు తాను స్వయంగా చూశానని చెప్పారు. కశ్మీరీ పండిట్లు అనుభవించిన బాధలను, వారిని 'ఇక్కడి నుంచి వెళ్ళిపోండి' అని అక్కడి వారు అనడాన్ని తాను గమనించానని.. ఎవరైనా మనల్ని వెళ్ళిపోమంటే కలిగే బాధ చాలా పెద్దదని, అందుకే ఆ నాటి పరిస్థితులను భిన్నమైన కోణంలో అద్భుతంగా చూపించిన ‘బారాముల్లా’ సినిమా తనకు బాగా నచ్చిందని పవన్ కళ్యాణ్ వివరించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిమానుల మధ్య “పవర్ స్టార్”గా ప్రసిద్ధి చెందిన ఆయన, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు.