
ఎన్డీయే ప్రభుత్వం కొనసాగాలన్నదే మహానాడు లక్ష్యం:
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండు రోజుల వార్షిక జాతీయ పండుగ ‘మహానాడు’ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల సందర్భంగా పార్టీ అగ్రనేతలు భవిష్యత్ కార్యాచరణను, పార్టీ లక్ష్యాలను ప్రకటించారు.
టీడీపీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. "మళ్లీ మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం రావాలన్నదే మా మహానాడు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మేము ప్రత్యేకంగా ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైపక్షాన్ని కేవలం ఏడు స్థానాలకే పరిమితం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలే మాకు స్పష్టమైన కార్యాచరణను అందించారని వ్యాఖ్యానించారు.
మరో కీలక నేత గౌతు శిరీష మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లపై పార్టీ స్పష్టమైన నిర్ణయంతో ఉందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా, ఆమోదించకపోయినా.. రాబోయే 2029 ఎన్నికల నాటికి లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను టీడీపీ స్వచ్ఛందంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
దీంతో పాటు, గత రెండేళ్లలో తాము చేపట్టిన చిన్న, పెద్ద సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణ పనులను, అలాగే యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలన్నింటినీ ఈ ఐదేళ్ల కాలంలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర యువతకు 24 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పారు. ముఖ్యంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారు తమ సొంత కాళ్లపై నిలబడేలా ఆర్థికంగా సాధికారత చేకూరుస్తామని గౌతు శిరీష పునరుద్ఘాటించారు.
