Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌ను గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్‌ను గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్‌ను గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Gaddamidi Naveen
1 జులై, 2026

తెలంగాణను భారతదేశపు అగ్రగామి ఏరోస్పేస్, రక్షణ రంగ ఉత్పాదక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఏరోమార్ట్ హైదరాబాద్ 2026’ సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో మూడు కొత్త విమానాశ్రయాలను/ఎయిర్‌ఫీల్డ్స్‌ను త్వరలోనే అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, తెలంగాణలో తమ తయారీ కేంద్రాలను విస్తరించాల్సిందిగా ప్రపంచవ్యాప్త ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు ఆయన బహిరంగ ఆహ్వానం పలికారు. 25కు పైగా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ ఏరోస్పేస్ లీడర్లు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ హాజరైన ఈ సదస్సులో.. గ్లోబల్ ఏరోస్పేస్ భాగస్వామ్య భవిష్యత్తుకు తెలంగాణనే ప్రధాన వేదిక కానుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. భారత వైమానిక దళంలో (ఐఏఎఫ్) ఫైటర్ పైలట్‌గా పనిచేసిన తనకు ఏరోస్పేస్ రంగం ఎల్లప్పుడూ గుండెకు దగ్గరైన అంశమన్నారు. తానే స్వయంగా మిగ్-21, మిగ్-23 వంటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలతో పాటు మిరాజ్-2000 విమానాన్ని కూడా నడిపిన అనుభవాన్ని పంచుకున్నారు. అంతరిక్ష రంగంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ఒక చిన్న విడిభాగం లేదా సీల్ లోపం కూడా మిషన్ విజయాన్ని లేదా వైఫల్యాన్ని శాసిస్తుందని.. ఒక నిపుణుడైన మిలిటరీ ఏవియేటర్‌గా తాను తెలంగాణ సాధించిన ఏరోస్పేస్ ప్రగతిని అంచనా వేస్తున్నానని చెప్పారు.

‘మేడ్ ఇన్ తెలంగాణ’ గ్లోబల్ బ్రాండ్

గత రెండున్నర ఏళ్లలో తెలంగాణ ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఏరోస్పేస్ హబ్‌గా ఎదిగిందని మంత్రి తెలిపారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జపాన్, ఇజ్రాయెల్, కెనడా వంటి ప్రముఖ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ప్రపంచంలోని అత్యంత అధునాతన విమానాలలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ముద్ర కలిగిన విడిభాగాలు నేడు వాడుకలో ఉన్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లను టాటా సికోర్స్కీ, అపాచీ హెలికాప్టర్‌ల ఫ్యూజలాజ్‌లను బోయింగ్, ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలను లాక్‌హీడ్ మార్టిన్, అలాగే సఫ్రాన్, జీఈ ఏరోస్పేస్, హనీవెల్ వంటి సంస్థలు ఏరో ఇంజిన్ భాగాలు, ఎంఆర్ఓ వ్యవస్థలను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నాయని వివరించారు. ఇటీవలే స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఏరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్‌లో తమ ఉత్పాదక కేంద్రాలను ప్రారంభించాయని మంత్రి గుర్తుచేశారు.

ఔషధ రంగాన్ని మించిపోయిన ఏరోస్పేస్ ఎగుమతులు

రాష్ట్రంలో ప్రస్తుతం 1,500కు పైగా ప్రత్యేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రక్షణ, అంతరిక్ష రంగాలకు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా తెచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీ స్థానిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తుందన్నారు. 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ', అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు పరిశ్రమకు అవసరమైన నిపుణులను అందిస్తున్నాయన్నారు. తెలంగాణ రక్షణ, ఏరోస్పేస్ రంగం ఏటా 30 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని.. గత ఏడాది ఈ రంగం యొక్క ఎగుమతులు ఏకంగా 103 శాతం రికార్డు వృద్ధిని సాధించి, రాష్ట్ర సంప్రదాయ ఎగుమతి రంగమైన ఫార్మాస్యూటికల్ (ఔషధ) రంగాన్ని మొదటిసారిగా అధిగమించిందని మంత్రి సంచలన గణాంకాలను వెల్లడించారు.

మూడు కొత్త విమానాశ్రయాల ప్రణాళిక

రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో మూడు కొత్త విమానయాన కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెలలో వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్‌లో పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే ఉమ్మడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి త్వరలో లభించే అవకాశం ఉందన్నారు. ఈ కొత్త విమానాశ్రయాలు ఎంఆర్ఓ సేవలు, ఇతర విమానయాన పరిశ్రమలకు తక్కువ నిర్వహణ వ్యయంతో అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని, తద్వారా తెలంగాణలో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

మెట్రో నగరాలతో పోలిస్తే ఈ కొత్త ప్రాంతాలలో నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల ఇవి మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైనవని మంత్రి వివరించారు. చివరగా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలూ అందుబాటులో ఉంటూ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక పారిశ్రామికవేత్తలు నాణ్యతతో పోటీపడి అంతర్జాతీయ సరఫరా గొలుసులో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. సదస్సును విజయవంతంగా నిర్వహించిన పారిశ్రామిక రంగానికి, అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్‌లు
TelanganaHyderabadAerospaceAeromart2026UttamKumarReddyDefenceManufacturingMakeInIndiaAviationWarangalAdilabadKothagudem