
‘యోగాంధ్ర-2026’ లో కోటి మంది భాగస్వామ్యమే లక్ష్యం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యోగాను ఒక ప్రజారోగ్య ఉద్యమంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ రాష్ట్రవ్యాప్త ఏకంగా కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని, ఒత్తిడి, ఆందోళన జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ఇది ఒక ప్రభావవంతమైన నివారణ మార్గమని సీఎం పేర్కొన్నారు. యోగా ప్రతి ఇంట్లోనూ నిత్య సాధనగా మారాలని, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇదొక శక్తివంతమైన ఉద్యమంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
జూన్ 7 నుంచి 20 వరకు ‘యోగాంధ్ర’ వేడుకలు
ఈ ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాలను జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. జిల్లా స్థాయి కార్యక్రమాలతో పాటు, రాజధాని అమరావతిలోని కృష్ణా నది పశ్చిమ బైపాస్ వంతెనపై 25,000 మంది పాల్గొనేలా ఒక భారీ యోగా ప్రదర్శనను ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ ప్రచారంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ను కేటాయించారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బందికి, కోనసీమ జిల్లాలో రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. యోగా టూరిజం ప్రోత్సహించడంలో భాగంగా ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక యోగా ఈవెంట్లను నిర్వహించనున్నారు.
ప్రభుత్వం తన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్లో భాగంగా 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారుచేయాలని, అలాగే శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమ మౌలిక సదుపాయాలు, ప్రచారం, సంస్థాగత ఏర్పాట్ల కోసం రూ. 10 కోట్లను కేటాయించినట్లు ప్రకటించారు. జూన్ నెలను ‘యోగా మాసం’గా ప్రకటించి యువత, మహిళలు, విద్యార్థులలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వాట్సాప్ యాప్స్ ద్వారా నిరంతర శిక్షణ
యోగాను ఏడాది పొడవునా కొనసాగే ఉద్యమంగా మారుస్తామని, దీనికోసం ఏపీ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, ‘హేబిల్డ్’ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా నిరంతర శిక్షణ అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో యోగాసనాలు, వ్యాధుల నివారణపై రూపొందించిన 168 కంటే ఎక్కువ శిక్షణా వీడియోలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు 8142404888 నంబరుకు "Hi de" అని వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ఈ వీడియోలను పొందవచ్చని, అలాగే యోగాంధ్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రచారాన్ని ‘సంజీవని’ ప్రాజెక్ట్తో అనుసంధానిస్తూ, చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి పాఠశాలలు, కళాశాలల్లో యోగాను చేర్చుతున్నట్లు వివరించారు.
గతేడాది విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపులను, ఒక స్కోచ్ అవార్డును సొంతం చేసుకుందని చంద్రబాబు ప్రకటించారు. గత సంవత్సరం 2.4 కోట్ల మంది యోగాంధ్ర కోసం నమోదు చేసుకోగా, 1.9 కోట్ల మంది ధృవీకరణ పత్రాలు పొందారని, 1.5 లక్షల మంది శిక్షకుల మద్దతుతో 1.33 లక్షల వేదికలలో ఈ కార్యక్రమం జరిగిందని సీఎం వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా 2.1 కోట్ల మంది క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
