Let's talk: editor@tmv.in
ఇంధన ధరల పెంపుపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసన

ఇంధన ధరల పెంపుపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసన

Gaddamidi Naveen
10 జూన్, 2026

దేశంలో నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అధికార పక్ష కాంగ్రెస్‌కు చెందిన మహిళా నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో భారీ నిరసన చేపట్టారు.

తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని గన్ పార్క్ వరకు వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేస్తూ.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం స్వార్థపూరితంగా ఇంధన ధరలను పెంచిందని ఆరోపించారు. ఈ పెంపు వల్ల రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, సామాన్యులకు తక్షణమే ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.