


నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన ముగ్గురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టీడీపి తరఫున ఎంపికైన సనా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి తమ నామినేషన్లను సమర్పించారని అధికారిక ప్రకటన వెల్లడించింది. కాగా, కూటమి ఒప్పందంలో భాగంగా ఇటీవల జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను.. అధికార ఎన్డీయే కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, మిగిలిన ఒక స్థానంలో మిత్రపక్షమైన జనసేన పోటీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం పదవీ విరమణ పొందుతున్న నలుగురు రాజ్యసభ సభ్యులలో ఎ. అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సనా సతీష్ బాబు ఉన్నారు. వీరిలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు సభ్యులు రిటైర్ అవుతుండగా, సనా సతీష్ బాబు మరోసారి కొత్త పదవీకాలం కోసం సోమవారం నామినేషన్ వేశారు.
ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఏడు స్థానాలు ఉండగా, టీడీపీకి రెండు స్థానాలు ఉన్నాయి. జూన్ 18న జరగనున్న ఎన్నికల అనంతరం ఈ సంఖ్యల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు, జనసేనకు 21 మంది, బీజేపీకి 8 మంది సభ్యులు ఉండగా, వైఎస్సార్సీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
