Let's talk: editor@tmv.in
తెలంగాణ–దక్షిణాఫ్రికా మధ్య వ్యూహాత్మక సాంకేతిక, పెట్టుబడి బంధం
తెలంగాణ–దక్షిణాఫ్రికా మధ్య వ్యూహాత్మక సాంకేతిక, పెట్టుబడి బంధం

తెలంగాణ–దక్షిణాఫ్రికా మధ్య వ్యూహాత్మక సాంకేతిక, పెట్టుబడి బంధం

Gaddamidi Naveen
4 జూన్, 2026

తెలంగాణ రాష్ట్రం, దక్షిణాఫ్రికా దేశాల మధ్య విద్య, వైద్య పర్యాటకం, సాంకేతికత పెట్టుబడుల రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. విద్యాపరమైన మార్పిడిని పెంచడం, వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం సాగనుంది.

భారతదేశ అధికారిక పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాల్ మషాతిలే బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు) పెట్టుబడి రంగాలలో తెలంగాణతో కలిసి పనిచేయడానికి తమ దేశం ఎంతో ఆసక్తితో ఉందని ఆయన వ్యక్తంచేశారు.

ఆఫ్రికా మార్కెట్‌కు గేట్‌వేగా దక్షిణాఫ్రికా

‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా దక్షిణాఫ్రికా ఒక అద్భుతమైన వేదికను అందిస్తోందని, దీని ద్వారా భారతీయ కంపెనీలు మిగిలిన యావత్ ఆఫ్రికా మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశించవచ్చని మషాతిలే పేర్కొన్నారు. ఇది దక్షిణాఫ్రికాలో భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీల స్థాపనకు చక్కని మార్గం సుగమం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలిపింది. న్యూఢిల్లీలోని దక్షిణాఫ్రికా హైకమిషన్.. రెండు ప్రాంతాల వ్యాపార, సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

తమ ప్రతినిధి బృందానికి ఘన స్వాగతం పలికినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మషాతిలే, జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధిస్తున్న అద్భుతమైన వృద్ధి పథం ఇక్కడి ప్రజల సంకల్పం, ఆవిష్కరణలు, వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనం. భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ, దేశ జీడీపీకి గణనీయమైన సహకారం అందించే స్థాయికి ఎదగడం నిజంగా ప్రశంసనీయం అని ఆయన కొనియాడారు.

పెట్టుబడులకు తెలంగాణ పూర్తి మద్దతు.. సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా వ్యాపార సంస్థలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, పటిష్టమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, కీలక రంగాలలో ఉన్న విస్తృత అవకాశాలను సీఎం ఈ సందర్భంగా వివరించారు.

హైదరాబాద్‌లో ఉన్న బలమైన విద్యా, నైపుణ్య శిక్షణా వ్యవస్థ కారణంగా ఈ రాష్ట్రం ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు ఒక ప్రధాన నాలెడ్జ్ హబ్‌గా మారిందని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఫార్చ్యూన్-500 కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) స్థాపనకు హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామి గమ్యస్థానంగా ఎదుగుతోందని చెప్పారు.

గ్లోబల్ సమిట్ 2026కు ఆహ్వానం

హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి వైద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి సీఎం చంద్రబాబు మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ.. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) సహా వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తక్కువ ఖర్చుతో కూడిన అత్యాధునిక వైద్య చికిత్సల కోసం ఇక్కడికి వస్తున్నారని హైలైట్ చేశారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025’ సాధించిన భారీ విజయాన్ని గుర్తుచేస్తూ, ఆ కార్యక్రమం ప్రపంచవ్యాప్త ప్రముఖులు, దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించిందని సీఎం చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 2026లో జరగబోయే గ్లోబల్ సమిట్‌కు హాజరు కావాల్సిందిగా దక్షిణాఫ్రికా ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు.