
దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, రాబోయే రోజుల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. సహజసిద్ధమైన పద్ధతిలో పార్టీ విస్తరణపై దృష్టి సారించామని, యువతకు రాజకీయ వేదికను కల్పించడమే తమ లక్ష్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
న్యూఢిల్లీలో జరిగిన ‘జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రయాణం’ అనే ప్రత్యేక సమావేశం సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో కలిపి సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మా ఆకాంక్షలు ప్రాంతీయమైనవి కావచ్చు.. కానీ మా ఆలోచనలు ఎల్లప్పుడూ జాతీయమైనవి. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని సహజ పద్ధతిలో విస్తరించాలని మేము యోచిస్తున్నాం. అయితే మేము ఇతర రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తామని లేదా వేగంగా ఎదుగుతామని చెప్పడం లేదు. అక్కడ ఒక మంచి వేదిక ఉంది, అవకాశాలు ఉన్నాయి, వాటి ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం అని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రానికి తగినట్లుగా ప్రత్యేక వ్యూహంతో, భిన్నమైన విధానంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
భారతదేశంలో యువత జనాభా అత్యధికంగా ఉందని, వారి ఆలోచనలకు రాజకీయ గుర్తింపు ఇవ్వకపోతే ఒక పార్టీగా తమ ప్రయాణంలో విఫలమైనట్లేనని మనోహర్ అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తమ రాష్ట్రాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకునే యువతకు జనసేనలోకి సాదర స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ జనసేనను "భవిష్యత్తు కోసం ఒక వేదికగా" భావించారని పేర్కొన్నారు. ఇది ఒక బలమైన సిద్ధాంతంపై నడిచే పార్టీ అని, ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన రీతిలో భాగస్వాములు కావచ్చని వివరించారు.
దేశమే ముందంజ – నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు
దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మనోహర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్డీయే కూటమిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జనసేన ఈ ప్రక్రియను సమర్థిస్తున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జనసేన గత 12 ఏళ్లుగా ఎన్నో కష్టనష్టాలను, ఒడిదొడుకులను చూసింది. ఎన్నో విజయాలు, అపజయాలను దాటుకుని వచ్చాం. కానీ మేము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నాం. అందులో మొదటిది – దేశమే ముందంజ అని మనోహర్ అన్నారు. ఢిల్లీకి వచ్చే మిగతా రాజకీయ పార్టీలు కేవలం అధికారం కోసమో లేదా నిరసనలు తెలపడానికో వస్తాయని, కానీ జనసేన మాత్రం జాతీయ సమగ్రతను చాటడానికే ఇక్కడికి వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో ప్రధాని మోడీ కృషి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం, జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, ‘జెన్ జెడ్’ యువతకు రాజకీయ వేదికను కల్పించడం వంటి పలు కీలక అంశాలపై మేధోమథనం జరిగింది. కాగా, మంగళవారం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 2014 మార్చిలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ప్రస్తుతం ఏపీలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు మంత్రులతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. పార్టీ మొత్తం సభ్యత్వం 21 లక్షలకు చేరింది.
