
విశాఖ తీరంలో ఆరుగురు మత్య్సకారుల గల్లంతు.. రెండో రోజూ కొనసాగుతున్న గాలింపు చర్యలు
విశాఖపట్నం తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను గుర్తించేందుకు భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం (కోస్ట్ గార్డ్) సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
జూలై 1న విశాఖపట్నం తీర ప్రాంతం నుంచి ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా వారి పడవ బోల్తా పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడిని అటుగా వెళ్తున్న ఓ నౌక సిబ్బంది సురక్షితంగా రక్షించగా, మిగిలిన ఆరుగురు ఇప్పటికీ గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులతో కలిసి గాలింపు చర్యలను సమీక్షించారు. గల్లంతైన మత్స్యకారులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు అన్ని వనరులను వినియోగించి చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వారి క్షేమంగా తిరిగి వచ్చేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నేవీకి చెందిన ఓ యుద్ధ నౌక, రెస్క్యూ బోటు, హెలికాప్టర్ను గాలింపు కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే రక్షించబడిన మత్స్యకారుడు అందించిన సమాచారం ఆధారంగా మిగిలిన వారి కోసం సముద్రంలో అన్వేషణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
ఒడిశా పూరీ తీరంలో 20 మంది ఏపీ మత్స్యకారులు సురక్షితం
ఇదిలా ఉండగా, మరో ఘటనలో ఒడిశాలోని పూరీ తీరానికి సమీపంలో సముద్రంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తోంది. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసుల వివరాల ప్రకారం, వారు ప్రయాణిస్తున్న చేపల వేట పడవకు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో లోతట్టు ప్రాంతానికి కొట్టుకుపోయింది. ముందుజాగ్రత్త చర్యగా అందులోని 20 మంది మత్స్యకారులను మరో పడవలోకి తరలించారు. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఆ పడవ ఒడ్డుకు చేరలేక సముద్రంలోనే నిలిచిపోయింది.
సమాచారం అందిన వెంటనే కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు మత్స్యకారులతో సంప్రదింపులు జరిపి, భారత తీర రక్షక దళం, ఒడిశా మెరైన్ పోలీసులతో సమన్వయం చేసి సహాయక చర్యలు ప్రారంభించారు. సోమవారం భారత తీర రక్షక దళానికి చెందిన నౌక అక్కడికి చేరుకుని మత్స్యకారులతో సంబంధాలు ఏర్పరచింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 20 మంది మత్స్యకారులతో ఉన్న పడవ సోమవారం రాత్రి కల్లా సురక్షితంగా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
