Let's talk: editor@tmv.in
ఏపీలో రూ.2.13 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
ఏపీలో రూ.2.13 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

ఏపీలో రూ.2.13 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

Dantu Vijaya Lakshmi Prasanna
7 మే, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) పలు నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో ఏకంగా రూ. 2,13,000 కోట్ల విలువైన 25 భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 39,067 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాలు పారిశ్రామిక హబ్‌లుగా మారేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి.

ఈ సమావేశంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం. విశాఖపట్నంలో సుమారు రూ. 1,08,010 కోట్లతో భారీ డేటా సెంటర్‌ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. దీనితో పాటు శ్రీసత్యసాయి జిల్లాలో రూ. 51,300 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను నెలకొల్పనుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే దాదాపు 21,000 మందికి ఉపాధి కలుగనుంది. ఐటీ, ఇంధన రంగాల్లో రిలయన్స్ రాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతాన్నిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

శక్తి వనరుల రంగంలో ఆంధ్రప్రదేశ్ స్వయంసమృద్ధి సాధించే దిశగా మరికొన్ని దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. కడప జిల్లాలో అదానీ గ్రూప్ రూ. 12,297 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. అలాగే, తిరుపతి జిల్లాలో యమాన్కో ఇండియా సంస్థ రూ. 9,398 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను, కర్నూలులో గ్రైడోన్ ఎనర్జీ రూ. 3,149 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నాయి. ఇంధన రంగంలో వస్తున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన విప్లవానికి నాంది పలకనున్నాయని చంద్రబాబు అన్నారు.

ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తిరుపతి జిల్లాలో రూ. 2,508 కోట్లతో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది, దీనివల్ల 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు.

అదేవిధంగా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అపోలో టైర్స్ రూ. 6,100 కోట్లు, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి.ఈ ప్రాజెక్టులు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్‌హౌస్‌గా మారుస్తాయని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, "ఏపీ బ్రాండ్" ప్రాముఖ్యతను చెప్పారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ప్రతి ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా గ్రౌండ్ కావాలని ఆయన ఆదేశించారు. అనుమతుల జారీలో ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ ఒక సులభతర వాణిజ్య వేదికగా కనిపించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అత్యంత వేగంగా అనుమతులిచ్చే అధికారులను ఆయా స్థానాల్లో నియమించాలని సూచించారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. "వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్" నినాదంతో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమని సీఎం తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ జోడింపు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని, మామిడి, ఆయిల్ పామ్, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లను అనుసంధానించాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమగ్ర పారిశ్రామిక వ్యూహం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయనుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.