
వైఎస్ జగన్తో సింగపూర్ కాన్సుల్ జనరల్ భేటీ
చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ ట్జే చియాంగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
దీనికి ముందు, సోమవారం ఎడ్గార్ పాంగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ భేటీ అయ్యారు. ఈ నెల ప్రారంభంలో సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటించిన విషయాన్ని, అలాగే ఏపీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఈ సందర్భంగా చర్చించినట్లు భారతదేశంలోని సింగపూర్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొంది. సింగపూర్ - ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు పాంగ్ తెలిపారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా 5 మెట్రిక్ టన్నుల ప్రీమియం ‘బంగినపల్లి మామిడి’ పండ్ల రవాణా సింగపూర్కు విజయవంతంగా చేరుకోవడంపై భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ వీ క్వెన్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా, ఐసీఏఆర్-సీఐఎస్హెచ్ ల సహకారంతో ఈ వాణిజ్య సముద్ర రవాణా సాధ్యమైంది.
'ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ' ద్వారా జూన్ 11, 2026న బయలుదేరిన ఈ రవాణా.. జూన్ 24న సింగపూర్ చేరుకుంది. ఏపీలోని గ్లోబల్ గ్యాప్ ధృవీకృత తోటల నుంచి సేకరించిన ఈ పండ్లను కర్ణాటకలోని అపెడా ప్యాక్హౌస్లో సింగపూర్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెస్ చేశారు. సింగపూర్ దిగుమతిదారు 'ఈసీ-లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్' ఈ పండ్ల అద్భుతమైన నాణ్యత, తీపిదనం, ఎక్కువ రోజులు నిల్వ ఉండే రకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. బంగినపల్లి మామిడి దాని సువర్ణ పసుపు రంగు, పీచు లేని గుజ్జు, అద్భుతమైన తీపిదనానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ను కలిగి ఉంది. ఈ మైలురాయి ఎగుమతి ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన హార్టికల్చర్ ఎగుమతులకు సరికొత్త మార్గం సుగమమైంది.
