Let's talk: editor@tmv.in
బౌల్డర్స్ క్లాసిక్ విజేతగా శుభంకర్ శర్మ

బౌల్డర్స్ క్లాసిక్ విజేతగా శుభంకర్ శర్మ

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 'బౌల్డర్స్ క్లాసిక్' గోల్ఫ్ టోర్నమెంట్‌లో భారత దిగ్గజ గోల్ఫర్ శుభంకర్ శర్మ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రూ. కోటి ప్రైజ్‌మనీతో నిర్వహించిన ఈ ప్రారంభ ఎడిషన్‌లో శుక్రవారం జరిగిన ఆఖరి రౌండ్‌లో శుభంకర్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. 2021 డిసెంబర్ తర్వాత తొలిసారిగా పీజీటీఐ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన ఆయన, తన అనుభవాన్నంతా రంగరించి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి టోర్నీ ఆద్యంతం తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

తొలి రోజు నుంచే జోరు

రెండుసార్లు డీపీ వరల్డ్ టూర్ టైటిల్స్ గెలుచుకున్న 29 ఏళ్ల శుభంకర్ శర్మ, ఈ టోర్నీలో మొదటి రోజు నుంచే తనదైన ముద్ర వేశారు. మొదటి రోజు ఆరు అండర్ 66 స్కోరుతో శుభారంభం చేసిన ఆయన, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ మరో ఆరు అండర్ 66 స్కోరు సాధించారు. దీంతో సగం టోర్నీ ముగిసేసరికి రెండు షాట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచారు. మూడో రోజున శుభంకర్ ఆడిన తీరు టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. తొమ్మిది బర్డీలు, కేవలం ఒక బోగీతో ఎనిమిది అండర్ 64 స్కోరు సాధించి, కోర్సు రికార్డును సమం చేయడమే కాకుండా ఏకంగా ఏడు షాట్ల భారీ ఆధిక్యాన్ని సంపాదించుకున్నారు.

చిరస్మరణీయ విజయం

చివరి రోజైన శుక్రవారం కూడా తన దూకుడును, నియంత్రణను కోల్పోకుండా ఆడిన శుభంకర్, ఎక్కడా తడబడకుండా ఛాంపియన్‌షిప్‌ను ముగించారు. పీజీటీఐ టూర్‌లో ఇప్పటివరకు ఆరు టైటిళ్లు గెలిచిన శుభంకర్‌కు, 2017 డిసెంబర్‌లో కోల్‌కతాలో జరిగిన మెక్‌లియోడ్ రస్సెల్ టూర్ ఛాంపియన్‌షిప్ తర్వాత స్వదేశీ టూర్‌లో ఇదే తొలి విజయం కావడం విశేషం. 2021లో జంషెడ్‌పూర్‌లో జరిగిన టూర్ ఛాంపియన్‌షిప్ తర్వాత ఆయన మళ్లీ ఈ టూర్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి.

విజయం అనంతరం శుభంకర్ శర్మ మాట్లాడుతూ, ఈ వారం అంతా తన ఆట సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు. "ఈ రోజు నా ఆట చాలా పటిష్టంగా ఉంది, బంతిని స్ట్రైక్ చేయడంలో నా ప్రదర్శన అద్భుతంగా అనిపించింది. గాలి వేగాన్ని, యార్డేజీలను అంచనా వేయడంలో విజయం సాధించడం కలిసొచ్చింది. మానసిక ప్రశాంతతతో ఉండటమే ఈ స్థిరత్వానికి కారణం. నేనేమీ ప్రత్యేకంగా చేయలేదు, కేవలం నా ప్రాసెస్ మీద దృష్టి పెట్టి తప్పులను తగ్గించుకున్నాను" అని ఆయన వివరించారు.

యువ గోల్ఫర్లకు స్ఫూర్తిగా..

భారత గోల్ఫ్ రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన శుభంకర్ శర్మ, 2024లో 'రౌండ్‌గ్లాస్ స్పోర్ట్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఆయన అనుభవం, పనితీరు రౌండ్‌గ్లాస్ గోల్ఫ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు శుభంకర్ సహకారం దోహదపడుతుందని పీజీటీఐ ఒక ప్రకటనలో తెలిపింది.