
ఏపీలో పలువురు ఐపీఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (ఎస్సీ.సీ) శాఖ జీఓ ఆర్టీఈ నెం.1330ను విడుదల చేసింది. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాను మార్కాపురం ఓఎస్డీ (అడ్మిన్)గా నియమించారు. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీశ్ను తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం) ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు.
నంద్యాల ఏఎస్పీ మందా జావళి అల్ఫోన్స్ను పోలవరం ఓఎస్డీ (అడ్మిన్)గా, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేను అమరావతిలోని ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా నియమించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని పల్నాడు అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితను నంద్యాల ఏఎస్పీగా నియమించారు. ఇప్పటికే మందా జావళి అల్ఫోన్స్ బదిలీ కావడంతో ఏర్పడిన ఖాళీని ఆమెతో భర్తీ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని డీజీపీ (హెచ్వోపీఎఫ్)ను ప్రభుత్వం ఆదేశించింది.
