
సెన్సెక్స్కు భారీ షాక్..852 పాయింట్ల పతనం
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొనగా, భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్క్ దాటడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. బీఎస్ఈ సెన్సెక్స్ 852.49 పాయింట్లు (1.09%) పడిపోయి 77,664 వద్ద ముగిసింది. రోజు మధ్యలో ఒక దశలో 942 పాయింట్ల వరకు క్షీణించింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 205.05 పాయింట్లు (0.84%) తగ్గి 24,173.05 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మొత్తం 2,517 షేర్లు పడిపోగా, 1,762 షేర్లు లాభపడ్డాయి. 170 షేర్లలో మార్పులేమీ లేవు. మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణంగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోవడం, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పరిణామాలు నిలిచాయి. ఈ పరిస్థితులతో గ్లోబల్ చమురు ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 103.8 డాలర్లకు చేరింది.
అమ్మకాల వైపే మొగ్గుచూపిన విదేశీ పెట్టుబడిదారులు
సెన్సెక్స్లో ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, లార్సన్ అండ్ టుబ్రో, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే పీఎస్యూ బ్యాంకింగ్, ఆటో, రియాల్టీ, కన్స్యూమర్ రంగాలు గణనీయంగా పడిపోయాయి. అయితే హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్, పవర్ రంగాలు కొంతమేర లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐస్) కూడా అమ్మకాలకే మొగ్గు చూపారు. బుధవారం ఒక్కరోజే రూ. 2,078 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు డేటా చెబుతోంది. ఇక రూపాయి కూడా వరుసగా నాలుగో రోజు బలహీనపడుతూ డాలర్కు 94.11 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్ అనిశ్చితి, పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ అన్ని కలిసి భారత మార్కెట్లపై ఒత్తిడి పెంచినట్లు విశ్లేషకులు తెలిపారు. బుధవారం కూడా సెన్సెక్స్ 756 పాయింట్లు పడిపోవడం, నిఫ్టీ 198 పాయింట్లు తగ్గడం గమనార్హం.
